న్యూఢిల్లీ, జూన్ 7: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్కు (బీఎస్ఎన్ఎల్) కీలకమైన పునరుద్ధరణ ప్యాకేజీకి ఆమోదముద్ర పడింది. మూడో పునరుద్దరణ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు అందించాలని బుధవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ పెట్టుబడి ద్వారా 4జీ, 5జీ స్పెక్ట్రంను బీఎస్ఎన్ఎల్కు కేటాయిస్తుంది. అదనపు ఈక్విటీ పెట్టుబడికి అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ అధీకృత మూలధనాన్ని రూ. 1,50,000 కోట్ల నుంచి రూ. 2,10,000 కోట్లకు పెంచుతారు. కేటాయించిన స్పెక్ట్రంతో బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సర్వీసుల్ని ప్రారంభించగలుగుతుంది. గ్రామీణ ప్రాంతాలు, ఇప్పటివరకూ కవరేజి లేని ప్రాంతాలకు 4జీ సర్వీసుల్ని తీసుకెళుతుంది.
హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూ) సర్వీసుల్ని అందిస్తుంది. అలాగే క్యాప్టివ్ నాన్-పబ్లిక్ నెట్వర్క్ (సీఎన్పీఎన్) కోసం సర్వీసులు/స్పెక్ట్రంను ఇస్తుంది. 2019లో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు కేంద్రం రూ. 69,000 కోట్ల తొలి పునరుద్ధరణ ప్యాకేజీని అందించింది. 2022లో రూ.1.64 లక్షల కోట్ల విలువైన రెండో ప్యాకేజీని ప్రకటించింది. సంస్థ మూలధన వ్యయాలకు, గ్రామీణప్రాంతాల ల్యాండ్లైన్స్కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, బ్యాలెన్స్ షీట్ మెరుగుపర్చడానికి ఆర్థిక మద్దతు, ఏజీఆర్ బకాయిల సెటిల్మెంట్, బీఎస్ఎన్ఎల్తో బీబీఎన్ఎల్ విలీనం తదితర కార్యకలాపాలకు గత రెండు ప్యాకేజీలను ఇచ్చింది. అటు తర్వాత బీఎస్ఎన్ఎల్ రుణభారం రూ. 32,944 కోట్ల నుంచి రూ. 22,289 కోట్లకు తగ్గింది.