హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రాష్ట్ర వార్షిక బడ్జెట్-2022-23లో విడిగా రూ. 1000 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. మధ్యస్థాయి, భారీ పరిశ్రమలకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఎటువంటి పోలికలేదని, అన్నింటికీ కలిపి బడ్జెట్ కేటాయింపులు జరపడంవల్ల సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అన్యాయం జరుగుతున్నదని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో 90 శాతానికిపైగా పరిశ్రమలు చిన్నవేనని, అత్యధికంగా ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నది కూడా ఇవేనని టీఐఎఫ్ ప్రధాన కార్యదర్శి గోపాల్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. భారీ, మధ్య తరహా పరిశ్రమలు భారీ పెట్టుబడులు, అధిక వ్యయంతో కూడుకున్నవి అయినందున బడ్జెట్లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు విడిగా కేటాయింపులు జరిపితే న్యాయం జరుగుతుందని వివరించారు.