Byjus | అప్పుల ఊబిలో చిక్కుకున్న టెక్-ఎడ్ యాప్ ‘బైజూ’స్ పొదుపు చర్యలు మరింత పెంచింది. తొలుత భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికి బైజూ’స్ యాజమాన్యం కార్యాలయాలను మూసేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)తోపాటు గుర్ గ్రామ్, బెంగళూరుల్లోని తమ ఆఫీసులను మూసేసింది. తాజాగా నోయిడాలోని కార్యాలయం మూసివేత ప్రక్రియ కొనసాగుతున్నదని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.
నోయిడా సెక్టార్-44లోని ఆఫీస్ స్పేస్ ఈ నెలలోనే క్లియర్ చేసింది. ఇప్పటికే ఈ కేంద్రంలో పని చేస్తున్న ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఇప్పుడు అదే భవనంలోని మరో అంతస్తులో తన అనుబంధ సంస్థ ‘ఆకాశ్’ తో కలిసి ఆఫీస్ స్పేస్ షేర్ చేసుకుంటున్నది.
మిగతా ఉద్యోగులను బెంగళూరుకు షిఫ్ట్ చేయడం కానీ, బైజూ’స్ ట్యూషన్ సెంటర్ల (బీటీఎస్) లో నియమించడం గానీ చేయాలని సంస్థ యాజమాన్యం భావిస్తున్నది. దేశవ్యాప్తంగా 143 నగరాలు, పట్టణాల పరిధిలో బీటీఎస్ ఆఫీసులు, ట్యూషన్ సెంటర్లు రెట్టింపు చేసింది. నొయిడా సెక్టార్ -44 ఆఫీసును వచ్చేనెల ఒకటో తేదీ నాటికి పూర్తిగా ఖాళీ చేయాలని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని సెక్టార్-3 ఆఫీసుకు తరలించనున్నారని సమాచారం.
తమ కంపెనీకి దేశవ్యాప్తంగా 30 లక్షల చదరపు మీటర్ల రెంటెడ్ ఆఫీస్ స్పేస్ ఉందని బైజూ’స్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. కానీ, కార్యాలయాల మూసివేతపై నోరు మెదపడం లేదు. ఇటీవలి కాలంలో సంస్థలో సుపరిపాలన వైఫల్యాలు, ప్రావిడెండ్ ఫండ్ చెల్లింపులో ఆలస్యం, ఆర్థిక ఫలితాల వెల్లడిలో జాప్యం, బోర్డు సభ్యుల రాజీనామా, 1.2 బిలియన్ డాలర్ల విలువ గల రుణ బకాయిల చెల్లింపులో వైఫల్యంతోపాటు ఆడిటర్ రాజీనామా వంటి సమస్యలతో బైజూ’స్ కొట్టుమిట్టాడుతున్నది.
ఏడాది కాలంలో మూడు వేల మందికి పైగా ఉద్యోగులను బైజూ’స్ తొలగించేసింది. ఐటీ, దర్యాప్తు సంస్థలు.. బైజూ’స్ కార్యాలయాల్లో సోదాలు జరిపాయి. రుణాలిచ్చిన సంస్థలు నోటీసులు జారీ చేయడంతోపాటు బైజూ’స్ యాజమాన్యంతో అనుబంధం తెంచేసుకున్నాయి. 2022 ఆర్థిక ఫలితాల వెల్లడిలో సుదీర్ఘ జాప్యానికి నిరసనగా తొలి నుంచి అడిటింగ్ సంస్థగా ఉన్న డెల్లాయిట్ రాజీనామా చేసింది. బైజూ’స్ ను రుణ దాతలు డిఫాల్టర్గా ప్రకటించాయి. దేశంలోనే అతిపెద్ద ఎడ్-టెక్ యాప్గా పేరొందిన బైజూ’స్ లావాదేవీలపై ప్రపంచవ్యాప్తంగా తనిఖీ జరుగుతున్నట్లు సమాచారం.