FSDC | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అన్లైన్ అప్లికేషన్లపై జరుగుతున్న చట్టవిరుద్ద రుణ వితరణను నిరోధించేక్రమంలో ఫైనాన్షియల్ రంగం అంతటా కస్టమర్ల వెరిఫికేషన్ ఒకే విధానంలో జరగాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) ప్రతిపాదన చేసింది. దేశంలోని ఫైనాన్షియల్ రెగ్యులేటింగ్ సంస్థలన్నింటికీ నేతృత్వం వహించే ఎఫ్ఎస్డీసీ బుధవారం తన ప్రతిపాదనను వెల్లడించింది.
అయితే ఈ ప్రతిపాదన ఎప్పటినుంచి అమలయ్యేదీ స్పష్టం చేయలేదు. నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రస్తుత నిబంధనల్ని సమావేశంలో చర్చించి, వీటిని ప్రామాణీకరించాలని నిర్ణయించినట్టు ఎఫ్ఎస్డీసీ తెలిపింది. బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తదితర వివిధ ఆర్థిక సంస్థలు ప్రస్తుతం తమ ఖాతాదారులను వెరిఫై చేయడానికి వేరువేరు మార్గాలను అనుసరిస్తున్నాయి.
ఈ ప్రక్రియను ప్రామాణీకరిస్తే ఫైనాన్షియల్ రంగం అంతటా కేవైసీ రికార్డులు పరస్పరం ఉపయోగించుకోవడం వీలుపడుతుందని కౌన్సిల్ వివరించింది. చట్టవిరుద్ధమైన ఆన్లైన్ లెండింగ్ యాప్స్తో కలిగే దుష్పరిణామాల్ని నిరోధించడానికి తగిన చర్యల్ని సమావేశంలో చర్చించినట్టు ఎఫ్ఎస్డీసీ ప్రకటన తెలిపింది. కొవిడ్ పాండమిక్ సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ యాప్స్ అధిక వడ్డీలు విధిస్తూ, అనైతిక రికవరీ ప్రక్రియలతో వేధింపులకు పాల్పడుతున్నాయి.