Airtel-AirFiber | ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్ టెల్ తక్కువ ధరకే తన యూజర్లకు 5జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలని తలపోస్తున్నది. అందుకోసం ఎక్స్ ట్రీమ్ ఎయిర్ ఫైబర్ పేరుతో 5జీ డివైజ్ ఆవిష్కరించనున్నది. ప్రస్తుతం టెలికం సేవలతోపాటు ఎక్స్ ట్రీమ్ పేరుతో ఎయిర్ టెల్.. ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎయిర్ ఫైబర్ సేవలు కూడా యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఎయిర్ టెల్ ప్రకటించకున్నా.. గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ ప్రత్యక్షమైందని టెక్ ప్రొఫెషనల్స్ గుర్తించారు.
ఎయిర్ టెల్ ఎయిర్ ఫైబర్ 5జీ డివైజ్ కోసం సిద్ధం చేసిన ఈ యాప్ ఉపయోగంలోకి వస్తే ఎటువంటి వైర్ లేకుండానే ఎయిర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతాయి. తక్కువ ధరకే వేగవంతమైన 5జీ ఇంటర్నెట్ సేవలు అందించడం ఎయిర్ టెల్ లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ డివైజ్ చిన్నపాటి టవర్ రూపంలో ఉంటుంది. దీన్ని ఇంట్లో 5జీ సిగ్నల్ వచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఒక సిమ్ కార్డు, పవర్ సప్లయ్ ఉంటే చాలు.. వై-ఫై 6కి సపోర్ట్ చేస్తుందని వినికిడి. వై-ఫై 5 రూటర్ల కంటే 50 శాతం ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుందని ఎయిర్ టెల్ చెబుతున్నది.
100 ఎంబీపీఎస్ తో కూడిన ఇంటర్నెట్ కావాలంటే ఆరు నెలలకు రూ.2,994 చెల్లించాలి. రూ.5000 నుంచి రూ.6000 ఉంటుందని తెలుస్తున్నది. మరోవైపు రిలయన్స్ జియో సైతం ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తేవడానికి ఎంతోకాలంగా సన్నాహాలు చేస్తున్నది. రిలయన్స్ జియో ఫైబర్’ని ఎదుర్కొనేందుకు ఎయిర్ టెల్ సైతం ఎయిర్ ఫైబర్ డివైజ్ తెస్తున్నట్లు సమాచారం.