న్యూఢిల్లీ : కొత్తగా స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే యూజర్లు 5జీ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ కోరారు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా తమ లొకేషన్ ఎయిర్టెల్ 5జీ సేవలకు సపోర్ట్ చేస్తున్నదా అని యూజర్లు త్వరలో చెక్ చేసుకోవాలని సూచించారు. దీపావళికి ముందుగా అక్టోబర్ నాటికి దేశంలో 5జీ సేవలను ప్రారంభిస్తామని అంతకుముందు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇదే సమయంలో కాస్త అటూ ఇటుగా తన ప్రత్యర్ధి, రిలయన్స్ జియో కూడా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఇక యూజర్లకు ఎయిర్టెల్ సీఈవో రాసిన లేఖలో 5జీ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలని సూచించారు. నెలలోగా తమ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నామని, డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా కీలక మెట్రో నగరాలను కవర్ చేస్తామని గోపాల్ విఠల్ చెప్పారు. ఆపై దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులను వేగంగా విస్తరిస్తామని అన్నారు. 2023 సంవత్సరాంతానికి పట్టణ ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
కస్టమర్ల స్మార్ట్ఫోన్ల ఆధారంగా నాన్ స్టాండ్ఎలోన్ (ఎన్ఎస్ఏ) ప్రాతిపదిన ఎయిర్టెల్లో 5జీ నెట్వర్క్ నిర్మిస్తామని చెప్పారు. ఈ వ్యవస్ధ ద్వారా న్యూ సిమ్ కార్డు పొందాల్సిన అవసరం లేకుండా, తాజా మౌలిక సదుపాయాల కల్పనతో నిమిత్తం లేకుండా సున్నితంగా 5జీ సేవలను ప్రారంభించవచ్చు. దీంతో భారత్లో అన్ని 5జీ స్మార్ట్ఫోన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎయిర్టెల్ నెట్వర్క్పై పనిచేస్తాయి.