న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశీ విమానాశ్రయాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలిరానున్నాయి. ఐదేండ్లకాలంలో వీటిలోకి రూ. 90,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనావేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ చెప్పారు. బుధవారంనాడిక్కడ బన్సాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ రంగంలో ప్రైవేటు సంస్థలే రూ. 68,000 కోట్ల వరకూ పెట్టుబడి చేస్తాయని, రూ. 20,000-22,000 కోట్లు ఎయిర్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇన్వెస్ట్ చేస్తుందని వివరించారు. అలాగే ఐదేండ్లలో దేశంలో నిర్వహణా ఎయిర్పోర్ట్ల సంఖ్య..హెలిపోర్ట్లతో సహా 220కు చేరుతుందన్నారు. ప్రస్తుతం 136 నిర్వహణా విమానాశ్రయాలున్నాయి. గురువారం ఉత్తరప్రదేశ్లోని జెవార్లో ప్రధాని నరేంద్ర మోది కొత్త ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయనున్నారు. గోవాలోని మోపాలో వచ్చే ఏడాది కొత్త ఎయిర్పోర్ట్ సిద్దమవుతుందని, నవీముంబైలో కూడా కొత్తది వస్తున్నదని కార్యదర్శి తెలిపారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లో విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం రోజువారీ విమానప్రయాణీకుల సంఖ్య కొవిడ్ ముందస్తు స్థాయి అయిన 4 లక్షలకు సమీపిస్తున్నది. గతంలోకంటే ఇప్పుడు మరింత వేగంగా విమానయాన రంగం వృద్ధిచెందుతుందని బన్సాల్ చెప్పారు.
ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియను డిసెంబర్ చివరికల్లా పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఏవియేషన్ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ తెలిపారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు జరిగిన బిడ్డింగ్లో ఈ సంస్థను టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు విక్రయించేందుకు టాటా సన్స్తో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 25న షేర్ పర్చేజ్ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఎయిర్ ఇండియాకు నెలకు రూ. 600 కోట్లకు పైగా నష్టం వస్తున్నదని.. ప్రస్తుతం సంస్థకు సీఎండీగా కూడా వ్యవహరిస్తున్న బన్సాల్ చెప్పారు.
అంతర్జాతీయ పౌర విమానయాన సర్వీసులు త్వరలోనే సాధారణ స్థాయికి వస్తాయని, ఈ సంవత్సరాంతానికి షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణ విమానాలు సజావుగా నడుస్తాయని ప్రభుత్వాధికారి చెప్పారు. కొవిడ్-19 కారణంగా 2020 మార్చి నుంచి అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి. ఈ రద్దును నవంబర్ 30 వరకూ పొడిగించారు. అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు ప్రస్తుతం ఇండియా 25కు పైగా దేశాలతో ఎయిర్ బబుల్ ఏరేంజ్మెంట్స్ చేసుకున్నదని, కొన్ని షరతులకు లోబడి ఈ దేశాలకు విమానాలు ప్రయాణిస్తాయన్నారు.