న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశీ ఎయిర్లైన్స్ పరిశ్రమ ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.15,000-17,000 కోట్ల నష్టాల్ని చవిచూస్తుందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడం, రూపాయి విలువ క్షీణించడం పరిశ్రమ నష్టాలకు కారణమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఎయిర్లైన్స్ పరిశ్రమ రూ.23,000 కోట్ల నష్టాల్ని తెచ్చుకుంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులు, రూపాయి విలువ ఎగుడుదిగుడులు పరిశ్రమ నిర్వహణా వ్యయాల్ని ప్రభావితం చేస్తాయని ఇక్రా వివరించింది.
ఏటీఎఫ్ సగటు ధర కిలోలీటర్కు గత ఏడాది రూ.74,171ఉండగా, ప్రస్తుతం రూ.1,24,400కు చేరింది. ఎయిర్లైన్ నిర్వహణా వ్యయంలో ఏటీఎఫ్దే 45 శాతం ఉంటుందని, అలాగే ఆ కంపెనీల 35-50 నిర్వహణా ఖర్చుల్ని అమెరికా డాలర్ నిర్దేశిస్తుందని తెలిపింది. దేశీ విమాన ప్రయాణీకుల ట్రాఫిక్ 2022 ఆర్థిక సంవత్సరంలో 57.7 శాతం వృద్ధితో 8.42 కోట్లకు పెరిగిందని, ట్రాఫిక్ వృద్ధిచెందుతున్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలోనూ పరిశ్రమకు భారీ నష్టాలు వస్తాయని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ చెప్పారు. పరిశ్రమ నష్టాల్లో ఉన్నా, తీవ్ర పోటీ నెలకొనడంతో పాటు మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు కంపెనీలు విమాన ఛార్జీలను భారీగా పెంచలేకపోతున్నాయని ఇక్రా వివరించింది.