ముంబై, అక్టోబర్ 17: విమానాల్లో కోరుకున్న చోట సీటు కావాలంటే ప్రయాణీకులు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఓ తాజా సర్వేలో గడిచిన 12 నెలల్లో మూడింటా ఒక వంతు ప్రయాణీకులు తమకు నచ్చిన చోట కూర్చోవడం కోసం ఎయిర్లైన్స్కు ఎక్కువగా చెల్లించినట్టు తేలింది. ఈ అంశంపై ఆన్లైన్ వేదిక లోకల్సర్కిల్స్ దేశంలోని 351 జిల్లాలవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 30వేల మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో దాదాపు 10వేల మంది కోరుకున్న సీటు కోసం అదనపు సొమ్మును ఇచ్చుకున్నామని చెప్పడం గమనార్హం. 2015లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. కోరుకున్న సీట్ల కోసం, లగేజీపై, ఎయిర్లైన్ లాంజ్ల వినియోగం, ఇతరత్రా సదుపాయాలకు ప్రయాణీకుల వద్ద అదనపు చార్జీలు వసూలు చేసుకోవడానికి విమానయాన సంస్థలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
రూ.200-1,500
టిక్కెట్ బుకింగ్ సమయంలో తమకు ఫ్రీ సీటింగ్ ఆప్షన్ను ఎయిర్లైన్స్ ఇవ్వలేదని ప్రతీ ముగ్గురిలో ఒక్కరు ఈ సర్వేలో చెప్పారు. ఇక అదనంగా రూ.200 నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తేనే నచ్చిన సీట్లను రిజర్వ్ చేసుకోగలిగామని కొందరు ప్రయాణీకులు వివరించారు. ముందు, ఎమర్జన్సీ వరుసల్లో సీట్లకు డిమాండ్ ఉంటుందంటున్నారు. మరోవైపు కొన్ని ఎయిర్లైన్స్ విమానంలోని అన్ని సీట్ల కేటాయింపులకూ అదనపు ఫీ చార్జ్ చేస్తున్నాయని, డిమాండ్ ఉందంటూ ఇంకొన్ని ఎయిర్లైన్స్ ఇంకా ఎక్కువగా కూడా వసూలు చేస్తున్నాయని ప్రయాణీకులు చెప్తున్నారు. ఒకవేళ ప్రయాణీకుడు ఫలానా సీటు కావాలని కోరకపోతే ఎయిర్లైన్సే బలవంతంగా ఫ్రీ సీట్లు అయిపోయాయంటూ అదనపు సొమ్మును రాబడుతున్నాయని చెప్పడం గమనార్హం. గత 12 నెలల్లో ఒకటి, అంతకంటే ఎక్కువసార్లు సీటును రిజర్వ్ చేసుకునేటప్పుడు అదనంగా చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రతీ ముగ్గురిలో ఇద్దరు తెలిపారు.
మునుపటి స్థాయికి రద్దీ
విమాన ప్రయాణీకుల రద్దీ కరోనాకు ముందున్న స్థాయికి మళ్లీ పుంజుకోగలదని దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికలో సోమవారం అంచనా వేసింది. కరోనా ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. కరోనా కేసుల ఉద్ధృతి, దేశంలో లాక్డౌన్లు, అంతర్జాతీయంగా రాకపోకలపై నిషేధం వంటివి ప్రయాణీకుల సంఖ్యను గణనీయంగా తగ్గించిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలోనే 2019-20లో నమోదైన ప్రయాణీకుల్లో దేశీయంగా 92 శాతం, అంతర్జాతీయంగా 75 శాతం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లోనే నమోదయ్యారని క్రిసిల్ చెప్పింది. దీన్నిబట్టి ఈసారి విమాన ప్రయాణీకులు భారీగా పెరగవచ్చన్నది.