హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): విమాన చార్జీలు భారీగా పెరిగాయి. టిక్కెట్ ధరలు 10-20 శాతం ఎగబాకాయి. నిర్వహణ భారం, ఇంధన ధరల మోతల నేపథ్యంలో దేశ, విదేశీ విమాన సర్వీసుల్లో టిక్కెట్ల ధరలు పరుగులు పెడుతున్నాయి. మరోవైపు కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో పర్యాటక రంగం ఒక్కసారిగా పుంజుకున్నది. దీంతో పెరిగిన డిమాండ్ కూడా చార్జీలకు రెక్కలొచ్చేలా చేసింది. ముఖ్యంగా కరోనా ప్రభావంతో కుదేలైన విమానయాన రంగానికి లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాధారణ ప్రయాణికులపై భారం మోపింది. దేశీయ విమాన చార్జీలపై ధరల నియంత్రణను ఎత్తివేయడం ప్రతికూలంగా మారింది. నిజానికి గత రెండేండ్లు కరోనా, లాక్డౌన్ కారణంగా పర్యాటక రంగం తిరోగమనంలో పడిపోయిన సంగతి విదితమే. గత 6 నెలల నుంచే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే ప్రయాణాలు పెరుగుతున్నాయి. అయితే పెంచిన విమాన చార్జీలతో పర్యటనల వ్యయాల్లో ప్రయాణ ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. గతంతో పోల్చితే ఒక్కో టిక్కెట్ ధరపై దేశీయ విమాన సర్వీసుల్లో రూ.1,800-2,300 పెరగగా, అంతర్జాతీయంగా 30 శాతం పెరిగాయని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి.
ఈ పండుగ సీజన్లో దేశీయ సర్వీసులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయింది. వాస్తవానికి ఏటా దేశీయంగా ప్రయాణించే విమాన ప్రయాణికుల రద్దీ దాదాపు 10-15 శాతం పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఇక కరోనా ఆంక్షలు లేనందున ఫ్లయిట్ ఎంక్వైరీలు దాదాపు 30 శాతం పెరిగాయని నివేదికలూ చెప్తున్నాయి. కాగా, పండుగల మధ్య హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంటున్నది. గతంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణ చార్జీలు రూ.5,100-7,200 ఉండగా, ప్రస్తుతం రూ.7,500-8,300 మధ్య ఉన్నాయి. ప్రయాణ సమయాన్నిబట్టి ధరలు ఆధారపడి ఉండగా.. అత్యవసర ప్రయాణానికి ఏకంగా రూ.31,462 వరకు చెల్లించాల్సిందే.
ప్రయాణ సమయాన్నిబట్టి విమాన చార్జీల్లో తేడాలుంటున్నాయి. ముఖ్యమైన సీజన్లో సా ధారణంగానే ధరలు ఎక్కువగా ఉంటాయి. నిరుడుతో పోల్చితే 15-30 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. ఇక ముఖ్యమైన సందర్భాలనుబట్టి ప్లయిట్ బుకింగ్ ధరలు పెరుగుతుంటాయి. అయినప్పటికీ ధరల పెరుగుదలతో టూరిజంపై ఎలాంటి ప్రభావం ఉండట్లేదంటున్నారు.
దసరా, దీపావళితోపాటు క్రిస్మస్ నెల వరకు దేశ, విదేశీ విమానాల బుకింగ్స్కి డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని ట్రావెల్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ముఖ్యంగా గోవా, కొచ్చి, పుణే, అహ్మదాబాద్, పాట్నా, బెంగళూరు, డెహ్రాడూన్ ప్రాంతాలకు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉండగా… గతేడాదితో పోల్చితే దాదాపు 35 శాతం రద్దీ పెరిగింది. అంతర్జాతీయంగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, వియత్నాం దేశాలకు డిమాండ్ ఉంటున్నది. అయితే ప్లాన్డ్ టూర్ల కోసం ట్రావెల్ ఏజెన్సీల ద్వారా 30-45 రోజుల ముందుగానే ఫ్లయిట్ బుకింగ్ చేసుకుంటున్నారు.