హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ/సిటీ బ్యూరో): యువ ఇంజినీర్లకు విమానాల నిర్వహణలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్.. జీఎమ్మార్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకొన్నది. దీంతో జీఎమ్మార్ సమగ్ర ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ (ఏఎంఈ) లైసెన్సింగ్ ప్రొగ్రామ్ను హైదరాబాద్లోని జీఎమ్మార్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్లోనే అందించే అవకాశం ఏర్పడింది. నాలుగేండ్ల ఈ కోర్సులో రెండు సంవత్సరాలు క్లాస్ రూమ్ బోధనతోపాటు నిర్వహణ, మరమ్మతులు, ఒవర్హాల్ (ఎంఆర్వో)పై, అనంతరం రెండేండ్లు జీఎమ్మార్ ఏరో టెక్నిక్ వద్ద శిక్షణ, ఎయిర్క్రాఫ్ట్ టైప్ ట్రైనింగ్ అందిస్తారు.
ఒప్పందంలో భాగంగా ఎయిర్బస్ సాఫ్ట్వేర్, కోర్స్వేర్, ట్రైనీ హ్యాండ్బుక్స్, ఎగ్జామినేషన్ డాటాబేస్, ఎయిర్బస్కు అవసరమైన ప్రాథమిక శిక్షణా మాడ్యూల్స్ను ఆన్లైన్ ద్వారా సమకూర్చుతుంది. అవసరమైన సాంకేతిక శిక్షణ మెటీరియల్ను ఎయిర్బస్ కాంపిటెన్స్ ట్రైనింగ్ రూపంలో అందిస్తుంది. జీఎమ్మార్ ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ, శిక్షణా కేంద్రం అసెస్మెంట్ను సైతం ఎయిర్బస్ చేయనున్నది. భారత్లో ఎంఆర్వో సామర్థ్యాలను మరింత విస్తృత పర్చడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ఎయిర్బస్ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్ రెమి మెల్లార్డ్ పేర్కొన్నారు. జీఎమ్మార్ ఏరో టెక్నిక్ సీఈవో అశోక్ గోపీనాథ్ మాట్లాడుతూ.. దేశంలో విమానయాన ఎకో సిస్టం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, 2030 నాటికి అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్ ఎదుగనున్నదని చెప్పారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ప్రధాన బోధనాంశాలుగా హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్ (క్లాస్-12) పూర్తిచేసినవారికి ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.