న్యూఢిల్లీ, జనవరి 26: దేశంలో హెలికాప్టర్లను అసెంబ్లింగ్ చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ ప్రముఖ వాణిజ్య గ్రూప్ టాటాలతో జతకట్టింది. ఇప్పటికే గుజరాత్లో ఎయిర్బస్కు ‘సీ295 మిలటరీ ఎయిర్క్రాఫ్ట్’ తయారీ సదుపాయాన్ని నెలకొల్పిన ఎయిర్బస్ తాజాగా ఏర్పాటు చేయబోయే ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ (ఎఫ్ఏఎల్) హెచ్ 125 హెలికాప్టర్లను తయారు చేస్తుంది. దేశంలో పౌర అవసరాలకు, పొరుగుదేశాలకు ఎగుమతి చేయడానికి ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తామని ఎయిర్బస్ హెలికాప్టర్స్ తెలిపింది. ఎఫ్ఏఎల్ను 24 నెలల్లో ఏర్పాటు చేస్తామని, ‘మేడ్ ఇన్ ఇండియా’ తొలి హెచ్ 125 హెలికాప్టర్ 2026లో వస్తుందని కంపెనీ తెలిపింది. ఎఫ్ఏఎల్ నెలకొల్పబోయే ప్రాంతాన్ని ఎయిర్బస్, టాటా గ్రూప్లు సంయుక్తంగా ఎంపికచేస్తాయి. ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఈ భాగస్వామ్య ఒప్పందం కింద టాటా గ్రూప్ సబ్సిడరీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్..ఎయిర్బస్ హెలికాప్టర్స్తో కలిసి అసెంబ్లింగ్ సదుపాయాన్ని నెలకొల్పుతుంది. ప్రధాన విడిభాగాలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ హార్నెసెస్, హైడ్రాలిక్ సర్క్యూట్స్, ఫ్లైట్ కంట్రోల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, ఫ్యూయల్ సిస్టమ్, ఇంజిన్ను ఎఫ్ఏఎల్లో ఇంటిగ్రేట్ చేస్తారని ఎయిర్బస్ హెలికాప్టర్స్ వివరించింది. దేశంలో టూరిజం రంగం వృద్ధికి హెచ్125 దోహదపడుతుందని పేర్కొంది.