India | హైదరాబాద్, జనవరి 18: భారత్లో వచ్చే 20 ఏండ్ల కాలంలో భారత్లో 2,840 నూతన విమానాలకు డిమాండ్ ఉంటుందని ఎయిర్బస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్, ఎండీ రోమి మైలార్డ్ తెలిపారు. అలాగే 41 వేల మంది విమాన చోదకులు, 47 వేల మంది టెక్నికల్ స్టాఫ్ అవసరమవుతారని హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 సదస్సులో చెప్పారు. ప్రస్తుతం భారత్ నుంచి ప్రతియేటా 750 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుండగా, వచ్చే దశాబ్దం తర్వాత ఇది రెండింతలు పెరిగి 1.5 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు మెండుగావున్నాయన్నారు.
గతేడాది ఎయిర్బస్కు ఇండియా నుంచి 750 విమానాల ఆర్డర్లు రాగా, వీటిలో 75 విమానాలను సరఫరా చేసింది. వీటిలో 41 ఇండిగోకు సరఫరా చేసిన సంస్థ..ఎయిర్ ఇండియాకు 19, విస్టారాకు 14, గోఫస్ట్కు ఒక్క సర్వీసును అందించింది. అంతర్జాతీయ విమానయాన రంగంలో భారత్ దూసుకుపోతున్నదని, అమెరికా, చైనాల తర్వాత మూడో అతిపెద్ద విమాన సేవలు అందిస్తున్న దేశంగా కొనసాగుతున్నదని చెప్పారు.
30 కోట్లకు ప్రయాణికులు: సింధియా
భారత్లో విమాన ప్రయాణికుల సంఖ్య నానాటికి పెరుగుతున్నారు. 2023లో 15.3 కోట్ల మంది దేశీయంగా ప్రయాణించగా, 2030 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడరు. విమాన ప్రయాణికులకు అనుగుణంగా విమానాశ్రయాలు, వాటర్డ్రోమ్స్ల సంఖ్యను 149 నుంచి 200కి పైగా పెంచడం జరిగిందని, దేశీయ విమానయాన రంగం ప్రతియేటా 10 శాతం నుంచి 15 శాతం వృద్ధి చెందుతున్నదన్నారు.
విమానయాన రంగంలో ఒక్క ఉద్యోగ కల్పనతో పరోక్షంగా ఆరుగురికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్న మంత్రి..అంతర్జాతీయంగా విమానయాన రంగం 6.1 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు. భారత్లో విమానాలు వాడేవారి సంఖ్య కేవలం 3 నుంచి 4 శాతం మధ్యలోనే ఉన్నదని, ఇది 10 శాతం నుంచి 15 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే సరుకు రవాణాలో వృద్ధి 60 శాతంగా ఉండగా, అంతర్జాతీయ రూట్లలో 53 శాతంగా ఉందన్నారు.
విమాన సర్వీసుల సంఖ్య 400 నుంచి 700కి పెరగగా, వచ్చే పదేండ్లలో ఈ సంఖ్య 2 వేలకు చేరుకునేదానిపై మంత్రి ధీమా వ్యక్తంచేశారు. ఇందుకోసం కొత్తగా మరో 50 విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు అంటే 65 ఏండ్లలో కేవలం 74 విమానాశ్రయాలు నిర్మితమవగా, గత పదేండ్లలో అదనంగా 75 ఎయిర్పోర్ట్లను నిర్మించినట్లు మంత్రి చెప్పారు.