Air India-Vistara | కేంద్ర ప్రభుత్వం నుంచి గతేడాది ఎయిర్ ఇండియాను టేకోవర్ చేసిన టాటా సన్స్.. విమాన సేవల విస్తరణ దిశగా వడివడిగా అడుగులేస్తున్నది. తద్వారా అంతర్జాతీయంగానే అతిపెద్ద ఎయిర్లైన్స్గా ఎయిర్ ఇండియాను తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఇందుకోసం భారీగా 470 విమానాల కొనుగోలుకు బోయింగ్, ఎయిర్బస్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చింది. తాజాగా టాటా సన్స్ తన అనుబంధ విస్తారా ఎయిర్లైన్స్ను ఎయిర్ ఇండియాలో విలీనం చేయడంపై ఫోకస్ చేస్తున్నది. విలీనం తర్వాత ఎయిర్ ఇండియాగానే పరిగణిస్తామని ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ చెప్పారు.
విదేశాల్లో ఎయిర్ఇండియాకు గల గుర్తింపును దృష్టిలో పెట్టుకున్నట్లు క్యాంప్బెల్ విల్సన్ సోమవారం వర్చువల్ మీడియా సమావేశంలో చెప్పారు. భారత్ మార్కెట్లో మంచి గుర్తింపు గల విస్తారాను విలీనం చేసిన తర్వాత దానికి ఎయిర్ ఇండియా పేరు కొనసాగించాలని నిర్ణయించామన్నారు. గతేడాది నవంబర్లో ఎయిర్ ఇండియాలో విస్తారాను విలీనం చేస్తామని టాటా సన్స్ ప్రకటించింది. ఈ విలీన ప్రక్రియకు ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి అనుమతులు రావాల్సి ఉందని క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు.
విస్తారా ఎయిర్లైన్స్ను సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి టాటా సన్స్ నిర్వహిస్తున్నది. టాటా సన్స్కు విస్తారాలో 51 శాతం వాటా, సింగపూర్ ఎయిర్లైన్స్ మిగతా వాటా ఉంది. అయితే ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం తర్వాత సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1 శాతం వాటా కేటాయిస్తారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అన్ని అనుమతులు సకాలంలో లభిస్తే వచ్చే ఏడాది మార్చికల్లా ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం పూర్తవుతుందని టాటా సన్స్ భావిస్తున్నది.
విమానాల తయారీ సంస్థలు ఎయిర్బస్, బోయింగ్లకు 470 విమానాల కొనుగోలు ఆర్డర్ విలువ రూ.5.8 లక్షల కోట్లు (70 బిలియన్ డాలర్లు) అని క్యాంప్బెల్ విల్సన్ తెలిపారు. ఎయిర్బస్ 250, బోయింగ్ 220 విమానాలు సరఫరా చేయనున్నాయి. ఎయిర్బస్ ఈ ఏడాది చివరి నుంచి విమానాలు సరఫరా చేస్తుంది. ఎయిర్బస్తో ఒప్పందం ప్రకారం 40 వైడ్-బాడీ ఏ350, 210 నారోబాడీ సింగిల్ ఎసైల్ ఏ320 నియోస్ విమానాలు సరఫరా చేస్తుంది. బోయింగ్తో 220 విమానాల కొనుగోలు కోసం 34 బిలియన్ డాలర్లు అందులో 190 బీ737 మ్యాక్స్, 20 బీ 787, 10 బీ777ఎక్స్ విమానాలు ఉన్నాయి.