Air India Sale | మహారాజా బాధ్యతలను ఎవరు చేపడతారన్న ప్రశ్నకు శుక్రవారం సమాధానం రాబోతున్నది. ఏండ్ల తరబడి విఫల ప్రయత్నాలకు ముగింపు పలుకనున్నది కేంద్ర ప్రభుత్వం.. అప్పుల ఊబిలో చిక్కుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా టేకోవర్ బిడ్ ఎవరు గెలుచుకున్నారో తేలనున్నదని ప్రభుత్వ వర్గాలు చెప్పారు. 68 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత దాని ఫౌండర్ల చేతికే చిక్కనున్నదని తెలుస్తున్నది. ఈ ఏడాది చివరికల్లా ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ టేకోవర్ చేయబోతున్నదని మీడియా వార్తలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియాను టాటా సన్స్ స్వాధీనం చేసుకోనున్నదన్న వార్త అబద్ధం అని మీడియా వార్తలను కేంద్రం నిరాకరించింది.
1932లో తొలి కమర్షియల్ లైసెన్స్డ్ పైలట్ జహంగీర్ రతన్ జీ దాదాబాయ్ టాటా (జేఆర్డీ టాటా) దేశంలో విమాన యాన సర్వీసులను ప్రారంభించారు. 1938లో విదేశాలకు విమాన సర్వీసులను విస్తరించింది. ఈ జాబితాలో కొలంబో కూడా చేరింది. తొలుత టాటా ఎయిర్ సర్వీసెస్.. తర్వాత టాటా ఎయిర్లైన్స్గా రూపాంతరం చెందింది.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బర్మాలో బ్రిటిష్ రాయల్ ఎయిర్ఫోర్స్కు మద్దతుగా విమాన సర్వీసులు కూడా నడిపింది. యుద్ధం ముగిసిన తర్వాత దాని పేరు ఇప్పటి ఎయిర్ ఇండియాగా మారింది. స్వాతంత్య్రం వచ్చాక ఎయిర్ ఇండియాలో కేంద్రం 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. 1953లో దాన్ని జాతీయం చేసి టాటా సన్స్ నుంచి పూర్తిగా టేకోవర్ చేసింది.
ప్రస్తుతం సంస్థపై రుణ భారాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం వ్యూహాత్మకంగా 100 శాతం వాటాల ఉపసంహరణకు తాజాగాగా 2020లో బిడ్లను ఆహ్వానించింది. ఇందులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 100 శాతం వాటా, ఎయిర్ ఇండియా సాట్స్ 50 శాతం వాటా ఉంది. నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేసినా స్పైస్జెట్ సీఈవో అజయ్ సింగ్ సారధ్యంలోని కన్సార్టియం, టాటా సన్స్ పోటీ పడుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ పూర్తవుతుందని కేంద్రం ప్రకటించింది. మొత్తం ఎయిర్ ఇండియా రుణ భారం రూ.43 వేల కోట్లకు చేరుకుందని ప్రభుత్వ వర్గాల కథనం.