న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. బాహుబలి డీల్స్కు దిగింది. భారీ ఎత్తున కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్నది. ఎయిర్బస్, బోయింగ్ల నుంచి దాదాపు రూ.6.5 లక్షల కోట్ల (80 బిలియన్ డాలర్లు)తో ఏకంగా 470 విమానాలను కొంటున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మెగా డీల్లో 70దాకా పెద్ద విమానాలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బస్ నుంచి 250 విమానాలను కొనుగోలు చేస్తుండగా.. అమెరికాకు చెందిన బోయింగ్ నుంచి 220 విమానాలు తీసుకుంటున్నది. ఈ ఏడాది ఆఖరు నుంచి విమానాల సరఫరా మొదలయ్యే అవకాశాలున్నాయి. 2025 మధ్యకల్లా పెద్ద ఎత్తున కొత్త విమానాలు అందగలవన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా వ్యక్తం చేసింది.
నాటకీయ పరిణామాల మధ్య..
ఎయిర్బస్ నుంచి 250 విమానాలను మాత్రమే కొంటున్నట్టు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎయిర్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. బోయింగ్ డీల్ను టాటా గ్రూప్ వర్గాలు బయటపెట్టలేదు. అయితే రాత్రి 8 గంటల సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. బోయింగ్తో ఎయిర్ ఇండియా బిగ్ డీల్ చేసుకుందని, ఇదో చారిత్రాత్మకమని ప్రకటించారు. ఈ క్రమంలో గంట తర్వాత 9 గంటల సమయంలో ఎయిర్బస్తోపాటు బోయింగ్ వద్ద కూడా 220 ఎయిర్క్రాఫ్ట్లను కొంటున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
17 ఏండ్ల తర్వాత..
కేంద్ర ప్రభుత్వం నుంచి టాటాల చేతికి వచ్చిన నేపథ్యంలో కార్యకలాపాల విస్తరణ దిశగా ఎయిర్ ఇండియా అడుగులేస్తున్నది. ఈ క్రమంలోనే గడిచిన 17 ఏండ్లకుపైగా కాలంలో విమానాలను తొలిసారి కొంటున్నది. చివరిసారిగా 2005లో బోయింగ్ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43 విమానాలను 10.8 బిలియన్ డాలర్లతో ఎయిర్ ఇండియా కొన్నది. కాగా, ఎయిర్ ఇండియాకు అందే 400 ఎయిర్బస్, బోయింగ్ సింగిల్-ఎస్సైల్ ఎయిర్క్రాఫ్ట్ల కోసం లీప్ ఇంజిన్ల ఆర్డర్ను అందుకున్నామని జీఈ ఏరోస్పేస్ కూడా ప్రకటించింది.
బోయింగ్ 737 కోసం..
మరోవైపు బోయింగ్ 737 ఎయిర్క్రాఫ్ట్ కోసం హైదరాబాద్లోని తమ ప్లాంట్ నుంచి ఫస్ట్ వర్టికల్ ఫిన్ స్ట్రక్చర్ను షిప్పింగ్ చేసినట్టు మంగళవారం టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) తెలిపింది. విమాన బాహ్య ఫలకం భాగమే (ప్లేన్ ఔటర్ బాడీ పార్ట్) ఈ వర్టికల్ ఫిన్. వాషింగ్టన్లోని రెంటన్లోగల బోయింగ్ ఉత్పాదక కేంద్రంలో సిద్ధమయ్యే 737 ఎయిర్క్రాఫ్ట్ల తయారీలో ఈ వర్టికల్ ఫిన్ను వినియోగిస్తారని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఓ ప్రకటనలో చెప్పింది.