Air India | టాటా సన్స్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా మలి విడుత స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రకటించింది. ఎయిర్ ఇండియాను టేకోవర్ చేయగానే ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనలో నాన్-ఫ్లయింగ్ సిబ్బందికి ఈ వీఆర్ఎస్ ఆప్షన్ అవకాశం కల్పించింది.
ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకుని 40 ఏండ్లు దాటిన పర్మినెంట్ జనరల్ క్యాడర్ ఉద్యోగులతోపాటు క్లరికల్, ఇతర క్యాటగిరీల ఉద్యోగులకు కూడా ఈ వీఆర్ఎస్ అమలు చేస్తామని ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ తెలిపింది. ఆసక్తి గల ఉద్యోగులు ఈ నెల 17 నుంచి వచ్చేనెల 30 వరకు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ గడువులోపు దరఖాస్తు చేసుకున్న వారికి ఒకే దఫాలో ఎక్స్గ్రేషియా చెల్లిస్తుంది ఎయిర్ ఇండియా. ఈ నెలాఖరులోపు అప్లయ్ చేసుకున్న వారికి అదనంగా రూ.లక్ష చెల్లిస్తామని ఆఫర్ చేసింది ఎయిర్ ఇండియా. కాగా, ఈ స్కీం కింద 2100 మంది సిబ్బంది వీఆర్ఎస్ తీసుకునేందుకు అర్హులని గుర్తించినట్లు సంస్థ వర్గాల కథనం.
గతేడాది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది టాటా సన్స్. మహరాజాను టేకోవర్ చేసినప్పటి నుంచి లాభాల బాట పట్టించడానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం పాతతరం ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా సాగనంపి, కొత్తవారికి చాన్స్ ఇవ్వాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.
తొలుత ఫ్లయింగ్, నాన్ ఫ్లయింగ్ సిబ్బందికి గతేడాది జూన్లో వీఆర్ఎస్ ప్రకటించింది. దీనికింద 4200 మంది సిబ్బంది అర్హులు. కానీ, 1500 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇతరులకూ వీఆర్ఎస్ వర్తింప చేయాలన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు తాజాగా రెండో వీఆర్ఎస్ ప్రకటించామని ఎయిర్ ఇండియా హెచ్ఆర్ అధిపతి సురేశ్ దత్ త్రిపాఠి చెప్పారు.
ఇటీవలే దాదాపు 500 విమానాల కొనుగోలు కోసం ఎయిర్బస్, బోయింగ్ సంస్థలకు ఎయిర్ ఇండియా ఆర్డర్లు పెట్టిన సంగతి తెలిసిందే. జాతీయంగా, అంతర్జాతీయంగా తన సేవలను విస్తరించాలని తలపెట్టింది. కొత్త విమానాల కొనుగోలుకు అనుగుణంగా ఈ ఏడాది సుమారు ఐదు వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది. ప్రస్తుతం మహరాజాలో మొత్తం 11 వేల మంది పని చేస్తున్నారు.