Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిరిండియా చారిత్రక నిర్ణయం తీసుకున్నది. ఎయిర్బస్, బోయింగ్ సంస్థల నుంచి 500 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వీటిల్లో ఎయిర్బస్ ఏ350, బోయింగ్ 787 & 777 విమానాలు కూడా ఉన్నాయి. తద్వారా మహారాజాకు పూర్వ వైభవం తేవాలని టాటా సన్స్ ఉవ్విళ్లూరుతున్నట్లు వినికిడి. 400 నారో వైడ్, 100 అంత కంటే మోర్ వైడ్ విమానాల కోసం ఆర్డర్ పెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈ విమానాల కొనుగోలు కోసం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థలతో ఎయిరిండియా ఒప్పందంపై సంతకాలు చేయనున్నదని విశ్వసనీయంగా తెలిసింది.
వీటిలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు 150 ఉన్నాయని సమాచారం. 500 విమానాల విలువ 100 బిలియన్ డాలర్లు అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఇంత భారీ మొత్తంలో ఒక ఎయిర్లైనర్ విమానాలు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. దశాబ్దం క్రితం 460 ఎయిర్బస్, బోయింగ్ జెట్ విమానాల కోసం అమెరికా విమానయాన సంస్థలు ఆర్డర్లు పెట్టాయి.
ప్రపంచాన్నే వణికించిన కరోనా మహమ్మారి తర్వాత క్రమంగా విమానయానానికి గిరాకీ పెరుగుతున్న వేళ 100 బిలియన్ డాలర్ల విలువైన విమానాలను కొనుగోలు చేయాలని టాటా సన్స్ వారి ఎయిరిండియా భావిస్తున్నది. విమాన ప్రయాణాలకు గిరాకీ ఎక్కువైనా పారిశ్రామికంగా, పర్యావరణ పరంగా పౌర విమానయాన రంగానికి సవాళ్లు కొనసాగుతున్న వేళ ఎయిరిండియా సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ఎయిరిండియా భారీగా విమానాలు కొనుగోలు చేయనున్నదన్న వార్తలపై స్పందించడానికి అటు ఎయిర్ బస్ గానీ.. ఇటు బోయింగ్ గానీ స్పందించలేదు. టాటా సన్స్ వారి ఎయిరిండియా అధికార ప్రతినిధి గానీ స్పందించడానికి ముందుకు రాలేదు.
సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి టాటా సన్స్ నిర్వహిస్తున్న జాయింట్ వెంచర్ సంస్థ విస్తారా.. కలిసిపోనున్న వేళ.. దేశీయంగా, అంతర్జాతీయంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ఎయిరిండియా తలపోస్తున్నది. 218 విమానాలతో దేశంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థగా టాటా సన్స్ ఎయిరిండియా నిలువనున్నది.