న్యూఢిల్లీ, నవంబర్ 29: విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడానికి పలు విమానయాన సంస్థలు ప్రత్యేకంగా ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్’ ఆఫర్లను ప్రకటించాయి. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోతోపాటు ఎయిర్ ఇండియా ఈ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంట్లో ఇండిగో ఒకవైపు ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,199గా నిర్ణయించింది. అంతర్జాతీయ రూట్లో రూ.5,199కే అందిస్తున్నది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 1 నుంచి మార్చి 31, 2025లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చును. అలాగే ఎయిర్ ఇండియా విమాన టికెట్ల బేస్రేట్పై 20 శాతం వరకు తగ్గింపు ధరకు విక్రయిస్తుండగా..అంతర్జాతీయ రూట్లపై 12 శాతం తగ్గింపునిస్తున్నది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జూన్ 30, 2025 లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. భారత్ నుంచి ఆస్ట్రేలియా లేదా ఉత్తర అమెరికాల మధ్య మాత్రం అక్టోబర్ 30, 2025 లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చును. ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, లిమిటెడ్ సీట్లు ఉండగా, తొలుత వచ్చిన వారికి మాత్రమే ఈ ఆఫర్ లభించనున్నదని పేర్కొంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉండనున్నాయి.