Air India Express | సిబ్బంది కొరత నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గురువారం 85 విమానాలను రద్దు చేసింది. 20 రూట్లలో విమాన సర్వీసులు నడుపనున్నట్లు తెలిపింది. ఎయిర్లైన్స్కు చెందిన సిబ్బంది అందరూ మూకుమ్మడిగా సిక్ లీవ్పై వెళ్లిన విషయం తెలిసిందే. ఫలితంగా మంగళవారం రాత్రి నుంచి 90కిపైగా విమానాలు రద్దయ్యాయి. తాము ఇవాళ 283 విమానాలను నడిపించనున్నట్లు ఎయిర్లైన్ ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని వనరులను సమీకరించామని.. 20 మార్గాల్లో కార్యకలాపాలను చేపట్టమని, ఎయిర్ ఇండియా తమకు సహాయం చేస్తుందని పేర్కొంది.
అయితే, తాము 74 విమానాలను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఒకసారి విమానాలు అందుబాటులో ఉన్నాయా? లేదా ? చేసుకోవాలని కోరింది. విమానాలు రద్దయినా.. మూడుగంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులు ఎలాంటి ఛార్జీలు లేకుండా టికెట్ డబ్బులు రీఫండ్ పొందవచ్చని లేదంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చని చెప్పింది. ఇదిలా ఉండగా.. సిక్ లీవ్పై వెళ్లిన 25 మంది సిబ్బందికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నోటీసులు జారీ చేసింది.
ఇతర సిబ్బందిని గురువారం సాయంత్రం 4గంటల్లోగా తిరిగి విధులకు హాజరుకావాలని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో కొందరు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పేర్కొంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నిబద్ధతతో ఉన్నామని.. కొందరి చర్యలు వేలాది మందికి తీవ్రమైన అసౌకర్యం కలిగించినందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యాన్ని నివారించేందుకు ఎయిర్లైన్స్ అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు.