PM Modi | ‘హవాయి చెప్పులు వేసుకున్న సామాన్యులు కూడా విమానంలో ప్రయాణించేలా చేస్తున్నాం’ ఇదీ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు పదేపదే చెప్పే మాట. విమానయానం అందరికీ అందుబాటులో ఉంచేలా చూడటమే తమ లక్ష్యమని చెబుతూ ఉంటారు. కానీ, వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నం. మోదీ పాలనలో విమాన చార్జీల భారం భారీగా పెరిగింది.
హైదరాబాద్, జూన్ 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): దేశీయ విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి విమాన ప్రయాణం కలగానే మిగిలిపోతున్నది. కరోనా తర్వాత భారత్లో దేశీయ విమాన ఛార్జీలు 41 శాతం పెరిగినట్టు తాజాగా ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏషియా – పసిఫిక్ అనే సంస్థ నివేదిక పేర్కొన్నది. మొత్తం 36 వేల విమాన రూట్లలో విమాన ఛార్జీలను అధ్యయనం చేసిన తర్వాత ఏషియా, పసిఫిక్, మధ్యప్రాచ్య దేశాలన్నింటిలోనూ భారత్లోనే విమాన ఛార్జీలు ఎక్కువ పెరిగినట్టు ఈ సంస్థ గుర్తించింది. మోదీ హయాంలో విమాన ఇంధనం ధరలు భారీగా పెరిగిపోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విమాన ఛార్జీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో విమాన ఛార్జీలు భారీగా పెరిగిపోతున్నాయి.
విదేశాల్లోనే తక్కువ
గడిచిన ఏడాదికాలంలో దేశీయ విమాన ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా సమయంలో 2020 మే నెలలో ప్రభుత్వం విమాన ఛార్జీలపై పరిమితి విధించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 2022 సెప్టెంబర్లో ఈ పరిమితిని ఎత్తివేసిన నాటి నుంచి ఇప్పటి వరకు విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో విమాన ఛార్జీల కంటే విదేశాల్లోనే తక్కువ ఉన్నాయంటే దేశీయ విమానయానం ఎంత భారంగా మారుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెల్స్కు దాదాపు 1,000 కిలోమీటర్ల విమాన ప్రయాణా టిక్కెట్ ధర రూ.4 వేల లోపే ధర ఉన్నది. హైదరాబాద్ – కోల్కతా, హైదరాబాద్ – ఢిల్లీ మధ్య విమాన ప్రయాణ దూరం దాదాపుగా 1,200 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రూట్లలో టిక్కెట్ ధర రూ.7,000 వరకు ఉన్నది. ఇక, జమ్ము , హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ర్టాల్లోని రూట్లలోఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి.
ఇంధన ధరలు డబుల్
దేశంలో విమాన ఛార్జీలు పెరగడానికి ప్రధాన కారణం విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరగడమే. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు విమాన ఇంధన ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. విమానయాన సంస్థల మొత్తం ఖర్చులో దాదాపు సగం ఇంధనానికే పోతుంది. 2020 సెప్టెంబర్లో విమాన ఇంధన ధర వెయ్యి లీటర్లకు రూ.39,492 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.89,303కు చేరుకున్నది. గత జూలైలో అయితే ఏకంగా రూ.1,41,233కు చేరుకొని ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు 2014 మార్చిలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 106 డాలర్లు ఉన్నప్పుడు విమాన ఇంధన ధర రూ.74,072 ఉండేది. ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్లు మాత్రమే.
ఈ లెక్కన విమాన ఇంధన ధర రూ.49 వేలు దాటకూడదు. అయితే, ప్రస్తుతం విమాన ఇంధన ధర 82 శాతం ఎక్కువగా ఉన్నది. అంటే, మోదీ సర్కారు ఏ స్థాయిలో విమాన ఇంధన ధరలు పెంచేసిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో విమాన ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ 8 శాతం ఉంటే బీజేపీ ప్రభుత్వం 14 శాతానికి తీసుకెళ్లి ఇటీవలే 11 శాతానికి దించింది. విమాన ఇంధన ధరలు తగ్గిస్తేనే విమాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉన్న ది. కానీ, ఈ చిత్తశుద్ధి బీజేపీ ప్రభుత్వానికి కనిపించడం లేదు. విమానయాన సంస్థలు ఎయిర్క్రాఫ్ట్ లీజు, మెయిన్టెనెన్స్ కోసం డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి విలువ తగ్గడం వల్ల ఈ ఖర్చులు పెరిగి ఛార్జీల పెరుగుదలకు కారణమవుతున్నది.