ముంబై, సెప్టెంబర్ 13: ఇటీవల ఆల్టైమ్ కనిష్ఠం వద్ద ముగిసిన తర్వాత క్రమేపీ కోలుకున్న రూపాయి బుధవారం తిరిగి క్షీణబాట పట్టింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 6 పైసలు నష్టపోయి 83.01 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, యూఎస్ డాలర్ బలపడటంతో రూపాయి తగ్గిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. అయితే దేశీయ స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ నెలకొనడం, మెరుగైన ఆర్థిక గణాంకాలు వెలువడటంతో కరెన్సీ క్షీణత పరిమితంగా ఉందని వివరించారు.
యూఎస్ ఫెడ్ ఈ ఏడాది మరో దఫా వడ్డీ రేటు పెంచుతుందన్న అంచనాలతో డాలరు బలపడుతున్నదని, దీనికి తోడు క్రూడ్ ధర సైతం పెరుగుతున్నందున, సమీప భవిష్యత్తులో రూపాయి బలహీనమేనని బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. సానుకూల స్టాక్ మార్కెట్ల కారణంగా దిగువస్థాయిలో దేశీ కరెన్సీకి మద్దతు లభిస్తుందన్నారు. 82.70-83.30 శ్రేణిలో ట్రేడవుతుందని అంచ నా వేశారు. డాలరు ఇండెక్స్ 104.79 స్థాయికి చేరగా, ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 92.50 డాలర్ల వద్ద కదులుతున్నది. తాజాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 77 పాయింట్లు ర్యాలీ జరిపి కొత్త రికార్డుస్థాయి 20,070 వద్ద ముగిసింది. వచ్చే కొద్ది రోజుల్లో యూఎస్డీ/ఐఎన్ఆర్ పెయిర్కు 83.15 వద్ద అవరోధం, 82.80 మద్దతు స్థాయిలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ అంచనా వేశారు.