న్యూఢిల్లీ, నవంబర్ 26: పేమెంట్ అగ్రిగేటర్గా కార్యకలాపాలు నిర్వహించేందుకు లైసెన్సు కోరుతూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ (పీపీఎస్ఎల్)ను రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. పీపీఎస్ఎల్ మాతృసంస్థ 97 కమ్యూనికేషన్స్ ఈ అంశాన్ని స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. పేటీఎం పేమెంట్ సర్వీసుల్లో కొత్తగా అన్లైన్ మర్చెంట్స్ను చేర్చుకోవడాన్ని ఆర్బీఐ నిలిపివేసిన సంగతి తెలిసిందే. పెండింగ్లో ఉన్న అనుమతులు వచ్చే వరకూ సంస్థ కొత్త ఆన్లైన్ మర్చెంట్స్ను చేర్చుకోకూడదు. దీంతో తమ ప్రస్తుత వ్యాపారంపై ప్రభావం పడలేదని, ప్రస్తుత ఆన్లైన్ మర్చెంట్స్కు అగ్రిగేటర్ సేవల్ని కొనసాగిస్తున్నామని, ఆఫ్లైన్ మర్చెంట్లను చేర్చుకుంటున్నామని, వారికి ఆల్-ఇన్-ఒన్ క్యూఆర్ కోడ్, సౌండ్బాక్స్, కార్డ్ మెషిన్స్ తదితర పేమెంట్ సర్వీసుల్ని అందిస్తున్నామని సంస్థ తెలిపింది. పేటీఎం బ్రాండ్కు యజమాని అయిన 97 కమ్యూనికేషన్స్ తన పేమెంట్ అగ్రిగేటర్ సర్వీసుల వ్యాపారాన్ని గతంలో పీపీఎస్ఎల్కు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు పీపీఎస్ఎల్ చేసుకున్న తొలి దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. పీపీఎస్ఎల్కు వ్యాపారాన్ని బదిలీ చేయడానికి అవసరమైన అనుమతుల్ని పొందిన తర్వాత తిరిగి దరఖాస్తు చేయాలని తెలిపింది. తగిన అనుమతులు లభించగానే అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయనున్నట్టు 97 కమ్యూనికేషన్స్ పేర్కొంది