Infosys | కరోనా మహమ్మారి తర్వాత అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్)తో ఐటీ నిపుణులు మూన్ లైటింగ్ (ఒకేసారి రెండు సంస్థలకు సేవలందించడం) చేస్తున్నారు. దీనిపై ఐటీ దిగ్గజాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో 300 మందిని ఇంటికి సాగనంపింది. మరో ఐటీ జెయింట్ ఇన్ఫోసిస్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నది. డ్యుయల్ ఉద్యోగాల విధానానికి అనుమతి ఇవ్వబోమని ఇన్ఫీ సీఈవో సలీల్ పరేఖ్ తేల్చేశారు. మూన్ లైటింగ్ పాల్పడిన ఉద్యోగులపై వేటు తప్పదని హెచ్చరించారు. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఆర్థిక ఫలితాలను గురువారం ఇన్ఫోసిస్ ప్రకటించింది.
ఈ సందర్భంగా మూన్ లైటింగ్పైన సలీల్ పరేఖ్ స్పందిస్తూ.. అలా చేస్తే ఉద్వాసన తప్పదని స్పష్టం చేశారు. గత 12 నెలలుగా మూన్ లైటింగ్కు పాల్పడిన పలువురు ఐటీ నిపుణులను తొలగించినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. అయితే, ఎంత మందిని తొలగించారన్న విషయమై ప్రకటన చేయలేదు. కాన్ఫిడెన్షియల్ అంశాలతో కూడిన ప్రాజెక్టుల్లో పని చేస్తున్న ఐటీ నిపుణులను ఇంటికి పంపేస్తామని సలీల్ పరేఖ్ వివరణ ఇచ్చారు. ఇన్ఫోసిస్లోనూ, బయట ఇతర ప్రాజెక్టులపై పని చేసేందుకు తమ ఉద్యోగులను అనుమతించే విషయమై విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని గిగ్ ప్రాజెక్టులపై పని చేయడానికి నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేనేజర్ల అప్రూవల్ తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
కంపెనీ కాంట్రాక్చువల్, కాన్ఫిడెన్షియల్ కమిట్మెంట్స్ను పూర్తిగా గౌరవించాలని సలీల్ పరేఖ్ సూచించారు. ఈ విషయమై తమ సంస్థ సమగ్ర విధానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా డ్యుయల్ ఉద్యోగాలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతకుముందు మూన్ లైటింగ్పై విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ ఆందోళన వ్యక్తం చేశారు. మూన్ లైటింగ్కు పాల్పడిన 300 మందిని విప్రో తొలగించేసింది.