India GDP | ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధంతో ముడి సరుకుల కొరత, పైపైకి క్రూడాయిల్ ధర ఫలితంగా ఆకాశాన్నంటే రీతిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో భారత వ్రుద్ధిరేటు (జీడీపీ)పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వ్రుద్ధిరేటు అంచనాల్లో కోత విధిస్తున్నాయి. ఆ జాబితాలో దేశీయ పారిశ్రామిక సంస్థల సంస్థ ఫిక్కీ, ఏషియాన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కూడా చేరాయి. ఫిక్కీ భారత జీడీపీ ఏడు శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఏడీబీ మాత్రం 7.5 నుంచి 7.2 శాతానికి భారత్ జీడీపీని కుదిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
ఆహార, ఫ్యూయల్ ధరలు పెరగడం భారత వ్రుద్ధిరేటుకు ప్రతిబంధకాలుగా మారతాయని ఏడీబీ తెలిపింది. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించింది. దీనికి తోడు కొవిడ్-19 మహమ్మారి మళ్లీ పుంజుకుంటుందన్న సంకేతాలతో డిమాండ్ తగ్గిపోతుందని తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు.. వినియోగదారుడి కొనుగోలు శక్తిని హరించేస్తాయని పేర్కొంది. ఈ పరిణామాలతో భారత్ రూపాయిపై అమెరికా డాలర్ విలువ బలోపేతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ కేవలం ఏడు శాతమేనని ఇండస్ట్రీ బాడీ.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సర్వేలో తేలింది. ఇంతకుముందు అంచనా వేసిన 7.4 శాతం, ఆర్బీఐ 7.2 శాతం కంటే ఇది తక్కువ. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రభావంతో ధరలు పెరిగిపోయి, వినియోగదారుల డిమాండ్ పడిపోతుందని తెలిపింది. గత ఆరు నెలలుగా వార్షిక వినియోగదారుల ధరల సూచీ .. ద్రవ్యోల్బణం 2-6 శాతం కంటే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం అని పేర్కొంది. కనుక, ధరలను అదుపు చేయడానికి వచ్చే మార్చిలోపు కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ 5.65 వాతానికి పెంచే అవకాశం ఉన్నదని ఫిక్కీ వివరించింది. ఆగస్టు నాలుగో తేదీన జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో మరో 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపింది. అంతర్జాతీయ ఫైనాన్స్ సేవల సంస్థ మోర్గాన్ స్టాన్ లీ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర జీడీపీ 7.6 నుంచి 7.2 శాతానికి కుదించి వేసిన సంగతి తెలిసిందే.