Adani to Takeover Ambuja & ACC |స్విట్జర్లాండ్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ సిమెంట్ కంపెనీ హోల్సిం ఇండియా అనుబంధ అంబుజా, ఏసీసీ సిమెంట్స్ సంస్థలను సొంతం చేసుకుంటున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 10.5 బిలియన్ డాలర్లకు ఈ రెండు సంస్థలను టేకోవర్ చేసింది. దీని ప్రకారం అంబుజా సిమెంట్స్లో గౌతం అదానీ గ్రూపుకు 63.1 శాతం, ఏసీసీ సిమెంట్స్లో 54.53 శాతం షేర్లు సొంతంకానున్నాయి. ఏసీసీలో అంబుజాకు 50 శాతం వాటాలు ఉన్నాయి.
ఆఫ్షోర్ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా తమ కుటుంబం ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ కుటుంబం తెలిపింది. ఈ పోటీలో ఆల్ట్రాటెక్, జేఎస్డబ్ల్యూ గ్రూప్లను అధిగమించి బిడ్ గెలుచుకున్నది అదానీ గ్రూప్. ఈ ఒప్పందంలో భాగంగా అంబుజా, ఏసీసీ సిమెంట్ ఆస్తులు కూడా అదానీ గ్రూప్ సొంతం కానున్నాయి. నాన్ ప్రమోటర్ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ఇవ్వనున్నది.
దీంతో దేశంలోకెల్లా రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా అదానీ గ్రూప్ నిలువనున్నది. గుజరాత్లోని దహేజ్, మహారాష్ట్రలోని రాయిగఢ్లలో రెండు సిమెంట్ యూనిట్లను ప్రారంభించడానికి అదానీ సిమెంటేషన్ లిమిటెడ్, అదానీ సిమెంట్ అనే సంస్థలను గతేడాది ఏర్పాటు చేసింది.