Gautam Adani | అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ వ్యక్తిగత సంపద సోమవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.4.49 లక్షల కోట్ల (54.4 బిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ఇంతకుముందు శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత అదానీ వ్యక్తిగత సంపద రూ.4.78 లక్షల కోట్లు (58 బిలియన్ డాలర్లు)గా నిలిచింది. సోమవారం రూ.28,770 కోట్ల నికర వ్యక్తిగత సంపదను గౌతం అదానీ కోల్పోయారు. దీంతో ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ టాప్-20లో గౌతం అదానీ స్థానం కోల్పోయారు.
హిండెన్బర్గ్ నివేదికతో వివిధ సంస్థల షేర్ల పతనాన్ని నిలువరించి.. ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేందుకు అదానీ గ్రూప్ చర్యలు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం రెవెన్యూ గ్రోత్ లక్ష్యాలను సగానికి సగం కుదించి వేసింది. ఇంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 40 శాతం రెవెన్యూ గ్రోత్ సాధించాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. కానీ, ఇప్పుడు దాన్ని 15-20 శాతానికి కుదించినట్లు సమాచారం.
సోమవారం అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ నష్టాల్లోనే ముగిశాయి. 10 లిస్టెడ్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ ఏడు శాతానికి పైగా, ట్రాన్స్మిషన్, పోర్ట్స్, విల్మార్, పవర్, టోటల్ గ్యాస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా సిమెంట్, ఎన్డీటీవీ దాదాపు ఐదు శాతం చొప్పున, ఏసీసీ స్టాక్ మూడు శాతానికి పైగా నష్టపోయాయి.