Adani Group | డీబీ పవర్ నుంచి దూరం జరిగిన అదానీ l రూ.7వేల కోట్ల డీల్కు బై.. బై చిక్కుల్లో ఉన్న ఇతర వ్యాపారాలను చౌకగా చేజిక్కించుకుంటూ ఆస్తుల్ని పెంచుకుంటున్న అదానీ గ్రూప్ తాజాగా చేతులెత్తేసింది. అమెరికా హెడ్జ్ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అదానీ ఆర్థిక స్థితి అల్లకల్లోలం కావడంతో రూ.7,000 కోట్ల టేకోవర్ను తప్పని పరిస్థితుల్లో వదిలేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: డీబీ పవర్ ఆస్తులను రూ.7వేల కోట్లతో కొనేందుకు అదానీ పవర్ చేసుకున్న ఒప్పందం చెడినట్టే కనిపిస్తున్నది. ఈ డీల్కున్న గడువు తాజాగా తీరిపోయింది మరి. నిజానికి ఈ లావాదేవీ ముగియడానికి పెట్టుకున్న ఆఖరు తేదీని ఇప్పటికే పలుమార్లు పొడిగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో చివరి సర్దుబాటుకూ బుధవారంతో కాలం చెల్లింది. ఫలితంగా ఈ డీల్ మరోమారు విఫలమైనట్టు స్టాక్ ఎక్సేంజీలకు అదానీ పవర్ తెలిపింది. అయితే గతంలో ఇలాగే జరిగిన ప్రతిసారీ కొత్త తేదీని ప్రకటించిన కంపెనీలు.. ఈసారి మాత్రం అందుకు సంబంధించిన సమాచారమేమీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఈ డీల్ విఫలం కావడానికి గల కారణాలనుగానీ, భవిష్యత్తులో దీన్ని పునరుద్ధరించేందుకున్న అవకాశాలనుగానీ అధికారికంగా ఏమీ చెప్పలేదు. దీంతో ఇప్పటికైతే ఈ లావాదేవీ ఆగినట్టేనంటున్నారు. మరోవైపు ఈ డీల్లో ముందుకెళ్లకూడదని ఇరు సంస్థలు ఓ అంగీకారానికి వచ్చినట్టు బ్లూంబర్గ్ కథనం ఒకటి చెప్తున్నది.
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పవర్.. డీబీ పవర్ ఆస్తులను కొంటామని గత ఏడాది ఆగస్టు 18న ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ డీల్ విలువ రూ.7,017 కోట్లు. అయితే దాదాపు గత 6 నెలలుగా ఈ లావాదేవీని పూర్తిచేయాలని అదానీ చూస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. నిజానికి ఈ డీల్కు సంబంధించిన ఎంవోయూ గడువు నిరుడు అక్టోబర్ 31నే తీరిపోయింది. అయినప్పటికీ ఇరు సంస్థల పరస్పర అంగీకారంతో నవంబర్ 30కి పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 31కి మార్చారు. ఈ ఏడాది జనవరి 15గా కూడా నిర్ణయించగా, ఎటూ తేలకపోవడంతో ఈ నెల 15దాకా తీసుకొచ్చారు. అయినా పనికాలేదు. చత్తీస్గఢ్లోని జంజ్గిర్ చంపా జిల్లాలో డీబీ పవర్కు 600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదక ప్లాంట్లున్నాయి. ఈ డీల్ పూర్తయితే థర్మల్ పవర్ ఇండస్ట్రీలో అదానీ పవర్ మరింతగా బలపడేదని మార్కెట్ అంచనా.
అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రిపోర్టు నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న అదానీ గ్రూప్.. ఇప్పట్లో ఎటువంటి టేకోవర్లకు దిగవద్దని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అదానీ సంస్థల మార్కెట్ విలువ ఇప్పటికే 120 బిలియన్ డాలర్లకుపైగా ఆవిరైపోయింది. ఓవైపు స్టాక్స్.. మరోవైపు బాండ్ల మార్కెట్లో పరపతిని పోగొట్టుకున్నది. ఇంకోవైపు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలన్నీ ప్రతికూలంగా స్పందిస్తున్నాయి. దీంతో నిధుల సమీకరణ కూడా కష్టతరంగా తయారైంది. ఈ నేపథ్యంలో డీబీ పవర్ డీల్ను పూర్తి చేయడం అసాధ్యమన్న అభిప్రాయానికి వచ్చే అదానీ పవర్ వెనక్కి తగ్గిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదానీ వ్యవహారం దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారడంతో కొంతకాలం ఆర్థిక లావాదేవీలను ఆపేద్దామన్న నిర్ణయానికి కూడా అదానీ వచ్చారని అంటున్నారు.