న్యూఢిల్లీ, మార్చి 23: ఆంధ్రప్రదేశ్లోని గంగవరం పోర్టు అదానీ గ్రూపు వశం కానున్నది. విశాఖ ఓడరేవుకు పక్కనే ఉన్న గంగవరం పోర్టు లిమిటెడ్ (జీపీఎల్)లో మెజార్టీ వాటాలను కైవసం చేసుకోబోతున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్ఈజడ్) మంగళవారం ప్రకటించింది. జీపీఎల్లో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు రూ.3,604 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో జీపీఎల్లో తమ వాటా 89.6 శాతానికి పెరుగుతుందని అదానీ గ్రూప్ తెలిపింది. ఇప్పటికే జీపీఎల్లో వార్బర్గ్ పింకస్ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న విండీ లేక్సైడ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్కు గల 31.5 శాతం వాటాను రూ.1,954 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఈ నెల 3న ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఏపీలోని అతిపెద్ద నాన్-మేజర్ పోర్టుల్లో గంగవరం పోర్టు రెండవది. దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. 1,800 ఎకరాల్లో విస్తరించిన ఈ పోర్టులో ప్రస్తుతం జీపీఎల్ 9 బెర్తులను నడుపుతున్నది. భవిష్యత్తులో ఈ బెర్తుల సంఖ్యను 31కి, వార్షిక సామర్థ్యాన్ని 25 కోట్ల టన్నులకు పెంచేందుకు జీపీఎల్ తగిన మాస్టర్ ప్లాన్ను కలిగి ఉన్నది.