NDTV to Adani | ఒక రంగం నుంచి మరో రంగానికి.. ఒక సెక్టార్ నుంచి మరో సెక్టార్లోకి అడుగులేస్తున్న భారత బిలియనీర్ గౌతం అదానీ.. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ వార్తా చానెల్ ఎన్డీటీవీ ( New Delhi Television – NDTV ) ని టేకోవర్ చేయబోతున్నారా.. అంటే అవుననే సమాధానమే వస్తుంది. పరోక్షంగా 29.18 శాతం వాటా కొనుగోలు చేశారు. ఇక ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటా కొనుగోలు చేయనున్నారని వార్తలొచ్చాయి. అదానీ గ్రూప్ .. అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ ఏఎంఎన్ఎల్ ఈ వాటా కొనుగోలు చేసినట్లు తెలిపింది.
ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్తోపాటు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రూ.294లకు వాటా చొప్పున 1,67,62,530 ఫుల్లీ పెయిడ్అప్ ఈక్విటీ షేర్ల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ చేశాయి. ఈ మూడు సంస్థల తరపున జేఎం ఫైనాన్సియల్స్ ఒక బహిరంగ ప్రకటన చేసింది. సెబీలోని రెగ్యులేషన్ 8 (2) నిబంధన ప్రకారం తమ ఆఫర్ ధర ఎక్కువనని పేర్కొంది.
అదానీ మీడియా సంస్థ అదానీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ (ఎఎంఎన్ఎల్) పరోక్షంగా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆర్ఆర్పీఆర్లో 99.99 శాతం వాటాను ఎఎంఎన్ఎల్ అనుబంధ వీసీపీఎల్ టేకోవర్ చేయనున్నది. ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థగా ఆర్ఆర్పీఆర్ 29.18 శాతం వాటా కలిగి ఉంది.
ఇదిలా ఉంటే బీఎస్ఈలో ఎన్డీటీవీ యాజమాన్యం ఒక స్టేట్మెంట్ ప్రకటన చేసింది. ఎన్డీటీవీలో వాటాలా ఉపసంహరణ, యాజమాన్య హక్కుల బదిలీపై రాధిక గానీ, ప్రణయ్ రాయ్ గానీ ఎటువంటి చర్చల్లో పాల్గొనడం లేదని తెలిపింది. వాటాదారుల ప్రయోజనాల కోసం ఈ వివరణ ఇస్తున్నట్లు వివరించింది.
ఎన్డీటీవీలో 61.45 శాతం వాటా ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొనసాగించాలని నిర్ణయించినట్లు ఎన్డీటీవీ తెలిపింది. ఎన్డీటీవీ వ్యవస్థాపక ప్రమోటర్లు తమ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తమ వాటాను విక్రయిస్తున్నారా.. ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై బీఎస్ఈలో ఫైలింగ్ చేశామని తెలిపింది. తమ సంస్థలు వాటాలు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్త పూర్తిగా నిరాధారమైందని స్పష్టం చేసింది.