Adani | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారతీయ సంపన్నులలో తొలి డాలర్ ట్రిలియనీర్ రికార్డును అందుకునేది అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీయేనని ఓ తాజా నివేదిక అంచనా. 2028కల్లా అదానీ సంపద ట్రిలియన్ డాలర్లను తాకుతుందని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ రిపోర్టు చెప్తున్నది. అదానీ వార్షిక సంపద సగటు వృద్ధిరేటు ప్రస్తుతమున్న 123 శాతం అలాగే కొనసాగితే అది సాధ్యమేనంటున్నది. అయితే ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ ఈ ఫీట్ను అందుకోవడానికి 2033 కావచ్చనడం గమనార్హం.
బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు అంబానీ సంపద విలువ 111 బిలియన్ డాలర్లు. అదానీ సంపద 99.6 బిలియన్ డాలర్లే. మరోవైపు ప్రపంచంలో తొలి డాలర్ ట్రిలియనీర్ ఘనతను సాధించేది టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్కేనని ఈ రిపోర్టు చెప్పింది. 2027కల్లా మస్క్ ఈ రికార్డును సొంతం చేసుకోవచ్చన్నది. మస్క్ సంపద 237 బిలియన్ డాలర్లుగా ఉన్నదిప్పుడు. 110 శాతం వార్షిక వృద్ధి నమోదవుతున్నది.