న్యూఢిల్లీ, ఆగస్టు 27: గౌతమ్ అదానీ గ్రూప్.. దేశీయ టెలికం పరిశ్రమలోకి అడుగుపెడుతుందన్న భయం తనకేమీ లేదని భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ అన్నారు. ఇటీవలి 5జీ స్పెక్ట్రం వేలంలో అదానీ గ్రూప్ రూ.212 కోట్లతో 26 గిగాహెట్జ్ శ్రేణిలో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రంను దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్పెక్ట్రం తమ సంస్థాగత వ్యాపార అవసరాల కోసమేనని అదానీ చెప్తున్నా.. 5జీ టెలికం సేవలను అదానీ కూడా ప్రారంభించవచ్చన్న అంచనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇక్కడ జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న మిట్టల్.. 5జీ రేసులో పోటీబడ్డ అందరినీ తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అలాగే అదానీ గ్రూప్ స్పెక్ట్రం అవసరాలనూ తమ ఎయిర్టెల్ తీర్చాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. ‘అదానీ అవసరాలను తీర్చడానికి నేను ఇష్టపడతాను.
ఒకవేళ తన అవసరాలను తానే తీర్చుకోవాలని అదానీ అనుకున్నా నాకు ఆమోదమే. కానీ అదానీ పోర్టులు, ఎయిర్పోర్టులు, ఇతరత్రా పరిశ్రమ అవసరాలను ఎయిర్టెల్ అయితేనే బాగా తీర్చగలదని నేను అనుకుంటున్నాను. మీరొక్కసారి జర్మనీలో చూసినట్టయితే వొడాఫోన్తో బీఎండబ్ల్యూ భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. నిజానికి బీఎండబ్ల్యూకు సొంతంగా స్పెక్ట్రం ఉన్నది. అయినప్పటికీ వొడాఫోన్కున్న అనుభవం దృష్ట్యా ఆ సంస్థతో బీఎండబ్ల్యూ కలిసి పనిచేస్తున్నది. అలాగే అదానీ కోసం ఎయిర్టెల్ అయితేనే బాగా పనిచేయగలదని నేను విశ్వసిస్తున్నాను’ అన్నారు. కాగా, భారతీయ టెలికం పరిశ్రమలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆధిపత్యంపై మాట్లాడుతూ.. జియో మూలధన బలం కంటే ఎయిర్టెల్ది ఎక్కువ కాకపోవచ్చని, అయితే టెక్నాలజీ, సర్వీసుల పరంగా జియోకు ఎయిర్టెల్ మాత్రం గట్టి పోటీనే ఇవ్వగలదన్నారు.