తీవ్ర వివాదంలో చిక్కుకున్న అదానీ గ్రూప్…కార్పొరేట్లు అవమానకరంగా భావించే నిర్ణయం తీసుకుంది. దేశంలో అతిపెద్ద ఆఫర్గా జారీచేసిన ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను రద్దు చేసుకుంది. ప్రతికూల పరిస్థితుల నడుమ సహ పారిశ్రామికవేత్తల తోడ్పాటుతో ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన మర్నాడే ఆఫర్ను క్యాన్సిల్ చేయాలని అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ బోర్డు నిర్ణయించింది.
ఆఫర్ ద్వారా సమీకరించిన రూ.20,000 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించనున్నట్టు బుధవారం రాత్రి స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యి, ముగింపు జరిగిన ఐపీవోను రద్దు చేసుకోవడం భారత్ మార్కెట్లో ఇదే తొలిసారి అవుతుందని విశ్లేషకులు తెలిపారు. ఆఫర్ సబ్స్క్రయిబర్ల (ఇన్వెస్టర్లు) ప్రయోజనాల రీత్యా ఎఫ్పీవో రద్దు చేయాలని బోర్డు తీర్మానించినట్టు కంపెనీ తెలిపింది. రూ.3,112-3,276 ధరల శ్రేణితో జారీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఐపీవో జనవరి 31 మంగళవారంనాడు ముగిసింది.
ఒక్కరోజులోనే రూ. 6 వేల కోట్ల నష్టం
అదానీ గ్రూప్ కార్పొరేట్ మోసాలకు పాల్పడుతున్నదంటూ ఆరోపణలు చేయడం, వాటిని గ్రూప్ తిరస్కరించి తమపై దాడి భారత్పై దాడిగా వర్ణించడం, జాతీయవాద ముసుగులో మోసాన్ని దాచలేరంటూ అమెరికా సంస్థ విరుచుకుపడటం వంటి అంశాల నడుమ అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై మంగళవారం రూ. 3,000కు కాస్త దిగువన ముగిసింది. అయితే బుధవారం మరో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ క్రెడిట్ సూసీ అదానీ బాండ్లకు జీరో విలువను అపాదించడంతో అదానీ షేరు నిట్టనిలువునా 28 శాతం కుప్పకూలి రూ. 2,135 వద్ద ముగిసింది. ఇది ఎఫ్పీవో ధరల శ్రేణి లోయర్ బ్యాండ్కంటే 31 శాతం తక్కువ. ఈ ప్రకారం ఆఫర్లో రూ.20,000 కోట్లు పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.6,000 కోట్లకుపైగా నష్టపోయినట్లయ్యింది.