న్యూఢిల్లీ, ఆగస్టు 26: తమ ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్లో వాటాను స్వాధీనపర్చుకునేందుకు సెబీ ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ ఎన్డీటీవీ చేసిన వాదనను అదానీ గ్రూప్ తిరస్కరించింది. ఈక్విటీ షేర్ల క్రయవిక్రయాలపై ఎన్డీటీవీ వ్యవస్థాపక ప్రమోటర్లు ప్రణయ్, రాధికా రాయ్లపై సెబీ విధించిన నిషేధం ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్కు వర్తించదని, ఈ అంశంపై ఆర్ఆర్పీఆర్ లేవనెత్తిన వాదనలు ఆధారరహితమైనవని, చట్టబద్దంగా చెల్లనేరవని అదానీ గ్రూప్ సంస్థ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ శుక్రవారం తెలిపింది.
వారెంట్ల మార్పిడికి తాము జారీచేసిన నోటీసు ప్రకారం తక్షణమే ఆర్ఆర్పీఆర్ తన ఒప్పందం అమలు బాధ్యతను నిర్వర్తించి, ఈక్విటీ షేర్లను కేటాయించాలని వీసీపీఎల్ కోరింది. పదేండ్ల క్రితం ఆర్ఆర్పీఆర్కు వీసీపీఎల్ ఇచ్చిన రూ. 403 కోట్ల రుణానికి జారీ అయిన వారెంట్లను మార్పిడి చేసి తమకు రెండు రోజుల్లో ఈక్విటీ షేర్లను కేటాయించాలంటూ ఆగస్టు 23న అదానీ గ్రూప్ ఒక నోటీసు పంపింది.
దానికి సెబీ అనుమతిని కారణం చూపుతూ ఎన్డీటీవీ తిరస్కరించింది. వీసీపీఎల్కు ఆర్ఆర్పీఆర్లో 99.5 శాతం షేర్లను కేటాయిస్తే, ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను అదానీ గ్రూప్ చేజిక్కించుకుంటుంది. మరో 26 శాతం వాటాకు.. షేరుకు రూ.294 ధరతో అదానీ ఓపెన్ ఆఫర్ ప్రకటించినదీ తెలిసిందే.