Adani | తమ గ్రూప్ సంస్థల ప్రతిష్ఠను దెబ్బ తీసిన యూఎస్ షార్ట్షెల్లర్ సంస్థ `హిండెన్బర్గ్ రీసెర్చ్` సంస్థకు గట్టి సవాల్ ఇచ్చేందుకు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సిద్ధమైంది. హిండెన్బర్గ్పై అమెరికాలో న్యాయ పోరాటానికి వాల్స్ట్రీట్ లా ఫర్మ్ `వాచ్టెల్`ను నియమించుకున్నట్లు వార్తలొచ్చాయి. గ్రూప్ సంస్థల ఖాతాల్లో ఫ్రాడ్, స్టాక్స్లో అవకతవకల ద్వారా అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నదని హిండెన్బర్గ్ ఆరోపణ.
హిండెన్బర్గ్ నివేదికను తోసిపుచ్చుతూనే న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చరించింది అదానీ గ్రూప్. తమ గ్రూప్ సంస్థలు గట్టి పునాదులపై పని చేస్తున్నాయని, ఎటువంటి ఆర్థిక రిస్క్లు ఎదుర్కోవడం లేదని పేర్కొంటూ తన వ్యాపార సామ్రాజ్యంపై ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న వాచ్టెల్ ఫీజు కాసింత ఎక్కువేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు, హిండెన్బర్గ్ నివేదికతో రోజురోజుకు తరిగిపోతున్న గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్, మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక, రేటింగ్ సంస్థల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు.. అదానీ గ్రూప్ సంస్థను, గౌతం అదానీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాచ్టెల్ నియామకంతో తమ గ్రూప్ సంస్థల ప్రతిష్ట పెరుగుతుందని, ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పిస్తుందని అదానీ గ్రూప్ భావిస్తున్నది.
గతంలో యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ల దాడిలో ఉక్కిరిబిక్కిరైన పలు అమెరికా కంపెనీలకు వాచ్టెల్ కంపెనీ న్యాయసలహాదారుగా ఉంది. వాచ్టెల్ కంపెనీ 1965లో ఏర్పాటైంది. ట్విట్టర్ ప్రస్తుత ఓనర్ ఎలన్మస్క్ తొలుత దాన్ని టేకోవర్ చేస్తానని చెప్పి, తర్వాత మాట మార్చిన సంగతి తెలిసిందే. ఎలన్మస్క్ను కట్టడి చేయడానికి ట్విట్టర్ యాజమాన్యం.. వాచ్టెల్ కంపెనీనే నియమించుకున్నది. 2018లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను ప్రైవేట్ కంపెనీగా మార్చాలని భావించిన ఎలన్మస్క్కు సలహాలిచ్చిన సంస్థ ఇది.
భారత్లోని న్యాయస్థానాలతోపాటు అమెరికాలోని న్యాయ స్థానాల్లోనూ హిండెన్బర్గ్ రీసెర్చ్పై అదానీ గ్రూప్ న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది. అమెరికా కోర్టులో అదానీ గ్రూప్ కేసు వేస్తే తాము ఆహ్వానిస్తామని హిండెన్బర్గ్ తెలిపింది. అదే సమయంలో అదానీ గ్రూప్ సంస్థల లావాదేవీలపై పత్రాలు ఇవ్వమని కోరతామని కూడా పేర్కొంది.