ఐదు రోజుల్లో రూ.లక్ష కోట్లు తగ్గిన సంపద
న్యూఢిల్లీ, జూన్ 18: ఆసియా శ్రీమంతుల జాబితాలో చకచకా ద్వితీయస్థానానికి ఎగబాకిన వాణిజ్యవేత్త గౌతమ్ అదాని ఈ వారం తృతీయస్థానానికి దిగివచ్చారు. అదాని గ్రూప్ కంపెనీల షేర్లు ఈ వారం భారీ పతనాన్ని చూసిన నేపథ్యంలో ఆయన సంపద రూ.లక్ష కోట్లకు పైగా తరిగిపోయింది. ఫోర్బ్స్ రియల్టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం గతవారాంతంలో 77 బిలియన్ డాలర్లున్న (రూ.5,64,410 కోట్లు) గౌతమ్ అదాని సంపద ఒక్కసారిగా 62.3బిలియన్ డాలర్లకు (రూ.4,61,020 కోట్లు) పడిపోయింది. అదాని గ్రూప్ కంపెనీల వాటాల్ని భారీమొత్తంలో కలిగిన మూడు విదేశీ ఫండ్స్ ఖాతాల్ని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) ఫ్రీజ్ చేసినట్లు వెలువడిన వార్తల ప్రభావంతో ఐదు రోజులపాటు ఆ గ్రూప్ షేర్ల క్షీణత కొనసాగింది. దాంతో ఆ గ్రూప్ మార్కెట్ విలువ రూ.9,50,000 కోట్ల నుంచి రూ.7,90,279 కోట్లకు పతనమయ్యింది. ఒకేవారంలో రూ.1,59,721 కోట్ల మార్కెట్ విలువను ఆ గ్రూప్ కోల్పోయింది. ఈ ప్రభావంతో ఆసియా శ్రీమంతుల జాబితాలో ద్వితీయస్థానంలోకి చైనాకు చెందిన వ్యాపారవేత్త జాంగ్ షాన్సాన్ (సంపద 70.8 బిలియన్ డాలర్లు) ఎగబాకారు. ఆసియాలో అత్యంత ధనికుడిగా ప్రస్తుతం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (85.3 బిలియన్ డాలర్ల సంపద) కొనసాగుతున్నారు.