న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పలు వ్యాపారాల విస్తరణ, టేకోవర్లలో నిమగ్నమైన ప్రపంచ శ్రీమంతుడు గౌతమ్ అదానీ గ్రూప్ ఫుడ్ బిజినెస్లో కూడా దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే వంటింటి నిత్యావసారాల వ్యాపారంలో ఉన్న అదానీ విల్మార్ దేశంలోనూ, విదేశాల్లోనూ వివిధ ఫుడ్ బ్రాండ్లను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. స్టేపుల్ ఫుడ్స్ (దుకాణాల సెల్ఫ్ల్లో ఉండే ఆహారోత్పత్తులు) బ్రాండ్లను, పంపిణీ సంస్థల్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అదానీ విల్మార్ సీఈవో, ఎండీ అంగ్షూ మాలిక్ తెలిపారు. మార్చికల్లా రెండు టేకోవర్లు పూర్తిచేయగలమని అంచనా వేస్తున్నామన్నారు.
కంపెనీ ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో ఫుడ్ బ్రాండ్ల కొనుగోళ్లకు రూ. 500 కోట్లు కేటాయించామని, అంతర్గత వనరుల ద్వారా అదనపు నిధుల్ని సమకూరుస్తామని చెప్పారు. అదానీ విల్మార్ షేరు ఈ ఏడాది ఫిబ్రవరిలో లిస్టయిన తర్వాత ఇప్పటికే మూడు రెట్లు పెరిగింది. కోహినూర్ కుకింగ్ బ్రాండ్తో సహా ఈ కంపెనీ ఇటీవల పలు ఫుడ్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. కోహినూర్ బాస్మతి రైస్, రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ కర్రీస్, మీల్స్ ఇప్పుడు అదానీ పరమయ్యాయి.
ఎఫ్ఎంసీజీ వ్యాపారంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించనున్నట్టు ఇటీవల ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన కొద్ది వారాల్లోనే అదానీ సైతం ఫుడ్ బిజినెస్ విస్తరణను వెల్లడించడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం భారత్ ఆహారోత్పత్తుల పరిశ్రమ టర్నోవర్ 400 బిలియన్ డాలర్లు. ఈ మార్కెట్లో పెద్ద వాటా సాధించేందుకు అదానీ, అంబానీలు పోటీపడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.