న్యూఢిల్లీ: ఒక్క ఏడాది.. ఒకే ఒక్క ఏడాదిలో వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల మొత్తం సంపద ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. 2019-20లో రూ.1.4 లక్షల కోట్లుగా ఉన్న అదానీ సంపద.. 2020-21లో రూ.5.06 లక్షల కోట్లకు చేరింది. ఆ లెక్కన ఆ ఏడాది మొత్తం అదానీ రోజువారీ సంపాదన ఏకంగా రూ.1002 కోట్లు కావడం గమనార్హం. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 తేల్చిన లెక్కలివి. ఈ తాజా లిస్ట్ ప్రకారం.. ఇండియాలోని 119 నగరాల్లో కనీసం రూ.1000 కోట్ల సంపద ఉన్న 1007 మంది వ్యక్తుల సంపద గతేడాది 51 శాతం పెరిగింది. ఓవైపు కరోనాతో ప్రపంచమంతా విలవిల్లాడుతుంటే.. మన కుబేరులు మాత్రం భారీగా సంపద పోగేసుకున్నట్లు ఈ తాజా రిచ్ లిస్ట్ స్పష్టం చేస్తోంది.
అదానీ.. కళ్లు చెదిరే వేగం
గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఒక్క ఏడాదిలోనే తమ సంపదను నాలుగు రెట్లు పెంచుకోవడమే తాజా లిస్ట్లో ఆశ్చర్యకరమైన విషయం. దీంతో సంపద విషయంలో దేశంలో ముకేశ్ అంబానీ తర్వాత రెండో స్థానంలో నిలిచారు గౌతమ్ అదానీ. అంతేకాదు ఏషియా రిచెస్ట్ లిస్ట్లోనూ చైనాకు చెందిన ఝాంగ్ షాన్షాన్ను అదానీ వెనక్కి నెట్టి రెండోస్థానానికి చేరినట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 వెల్లడించింది. గౌతమ్ అదానీతోపాటు ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా ఈ రిచ్ లిస్ట్లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఇక ఇదే ఏడాది కాలంలో ముకేశ్ అంబానీ రోజువారీ సంపాదన రూ.169 కోట్లుగా ఉంది. ఆయన మొత్తం సంపద 9 శాతం పెరిగి రూ.7.18 లక్షల కోట్లకు చేరింది. హెచ్సీఎల్ అధినేత శివ్ నాడార్ కుటుంబ సందప కూడా గతేడాది ఏకంగా 67 శాతం పెరిగి రూ.2.36 లక్షల కోట్లకు చేరడం విశేషం. గతేడాది ఆయన ప్రతి రోజూ రూ.260 కోట్లు సంపాదించారు. అటు లక్ష్మీ మిట్టల్ కుటుంబం గతేడాది రోజుకు రూ.312 కోట్ల సంపదను పోగేసుకున్నట్లు ఈ లిస్ట్ వెల్లడించింది. వ్యాక్సిన్ తయారీదారు సైరస్ పూనావాలా, ఆయన కుటుంబం గతేడాది ఏడాదికి రూ.190 కోట్లు సంపాదించింది.
కొత్తగా 58 మంది బిలియనీర్లు
ఇండియాలో గతేడాది కొత్తగా 58 మంది బిలియనీర్లు చేరడం విశేషం. దీంతో దేశంలో 2020-21లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 258కి చేరింది. ఇక ఇండియాలో యంగెస్ట్ బిలియనీర్గా భారత్పె పేమెంట్స్ యాప్ కోఫౌండర్ శాశ్వత్ నక్రానీ నిలిచారు. ఈ లిస్ట్పై హురూన్ ఇండియా ఎండీ, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ.. పదేళ్లలో పది రెట్లు. పదేళ్ల కిందట మా లిస్ట్లో కేవలం 100 మంది ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 1007కు చేరింది. ఇదే స్పీడులో వచ్చే ఐదేళ్లలో ఈ లిస్ట్లో 3 వేల మంది చేరొచ్చు అని అన్నారు.