విదేశాల నుంచి అదానీ కంపెనీల బొగ్గు దిగుమతుల వెనుక పెద్ద అవినీతే సాగింది. అంతకుమించి కోట్లాదిమంది అమాయకుల కష్టార్జితం అదానీ జేబుల్లోకి చేరింది.
తక్కువ ధరతో కొని ఎక్కువ ధరల్ని చూపిస్తూ దేశంలోకి దించుకున్న బొగ్గు కొండలను గౌతమ్ అదానీ తన అక్రమార్జనకు వాడుకున్నారని తేలింది.
సొంత ఓడరేవుల సాయంతో భారీ అవకతవకలకే పాల్పడగా.. విద్యుత్తు చార్జీల భారం వ్యాపార, పారిశ్రామిక రంగాలనూ దెబ్బతీసింది. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అండతో అదానీ సంపద అడ్డగోలుగా పెరిగిందంటూ స్టాక్ మార్కెట్ ఉల్లంఘనల్ని హిండెన్బర్గ్ బయటపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడీ బొగ్గు బాగోతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
అదానీ కంపెనీలు వేసే ప్రతీ అడుగు వెనుకా అవినీతే ఉంటుందని మరోమారు బహిర్గతమైంది. దేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నా, అవి ఇక్కడ చౌక ధరకే లభిస్తున్నా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ దేశ సంపదను కొల్లగొట్టి, సొంత ఆస్తులను గౌతమ్ అదానీ కూడబెట్టుకున్న తీరు విస్మయానికే గురిచేస్తున్నది. కొంతమంది దురాశకు దేశంలోని కోట్లాదిమంది సామాన్యులు ఎలా నష్టపోయారు.. వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎంతలా దెబ్బతిన్నాయన్నది బయటపడింది. ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక చేపట్టిన కస్టమ్స్ రికార్డుల సమీక్షల్లో అదానీ బొగ్గు బాగోతం అంతా వెలుగుచూసింది మరి. ఇక ఆయా విదేశీ కంపెనీల్లో అదానీ కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా, ఇక్కడి అదానీ కంపెనీల్లో సదరు విదేశీ సంస్థలవారు డైరెక్టర్లుగా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.
రాజకీయ అండదండలతో అన్ని రంగాలనూ తన గుప్పిట్లో పెట్టుకుంటున్న గౌతమ్ అదానీ.. అదే ధైర్యంతో భారీ అక్రమాలకే తెగబడినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ చెప్తున్నది. దేశంలో సరిపడా బొగ్గు నిల్వలున్నా.. తక్కువ ధరకే అవి లభిస్తున్నా.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ దేశ సంపదను దోచుకున్నారని, తద్వారా అభివృద్ధిని అడ్డుకున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయిప్పుడు. భారతీయ అతిపెద్ద ప్రైవేట్ బొగ్గు దిగుమతిదారుగా ఉన్న అదానీ గ్రూప్.. విదేశాల నుంచి తక్కువ ధరకే బొగ్గును కొని.. సొంత పోర్టుల్లో దిగుమతి చేసుకున్నదని, రికార్డుల్లో మాత్రం సదరు బొగ్గుకు ఎక్కువ ధరల్ని చూపించిందని తేలింది. ఈ బొగ్గుతో దేశీయంగా విద్యుదుత్పత్తిని చేసి మరింత ఎక్కువ ధరకు అదానీ కంపెనీలు అమ్ముకోవడం గమనార్హం. దీనివల్ల దేశంలోని కోట్లాదిమంది సామాన్య ప్రజలు నష్టపోగా.. వ్యాపార, పారిశ్రామిక రంగాలూ కుదేలయ్యాయి. విద్యుత్తు రంగంలో ద్రవ్యోల్బణానికీ అదానీ గ్రూప్ కారణమైంది. అంతేగాక దేశ ఖజానాకు రావాల్సిన సొమ్ము.. అదానీ వల్ల విదేశాలకు ఆదాయంగా మారిందన్న విమర్శలూ ఇప్పుడు ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అదానీ గ్రూప్ అక్రమాలు ఏండ్ల తరబడి బయటకొస్తూనే ఉన్నాయి. కానీ నరేంద్ర మోదీతో ఉన్న సంబంధాలు.. గౌతమ్ అదానీకి క్లీన్చిట్నే ఇస్తున్నాయి. నిజానికి ఏడేండ్ల క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ).. అదానీ సంస్థల అక్రమాలను గుర్తించింది. ఇండేనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటూ దేశంలో కృత్రిమ బొగ్గు కొరతను సృష్టిస్తున్నారని, దీన్ని విదేశాలకు ధనాన్ని తరలించే మార్గంగానూ మార్చుకుంటున్నారని అదానీసహా 40 దిగుమతిదారులకు 2016 లో డీఆర్ఐ నోటీసులిచ్చింది. అసలు పోర్టుల్లో దిగుమతైన బొగ్గుకు చూపించిన ధరల్లో 50 శాతానికే కొంటున్నారన్నది. ఈ బొగ్గుతో తయారైన విద్యుత్తును అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించింది. ఎక్కువ ధరకు విద్యుత్తును కొని ప్రజలు, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు నష్టపోతున్నాయని తేల్చిచెప్పింది. అయితే కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే కాబట్టి.. డీఆర్ఐ చూపించిన రుజువులేవీ చెల్లలేదు.
. – బిజినెస్ డెస్క్
తైవాన్, దుబాయ్, సింగపూర్ దేశాల్లోని మధ్యవర్తులను వాడుకొని గడిచిన రెండేండ్లకుపైగా కాలంలో 5 బిలియన్ డాలర్ల విలువైన బొగ్గు దిగుమతుల్ని చేసుకున్న అదానీ గ్రూప్.
2021 జూలై నుంచి హీ లింగోస్, తౌరుస్ కమోడిటీస్ జనరల్ ట్రేడింగ్, ప్యాన్ ఆసియా ట్రేడ్లింక్ కంపెనీలకు మొత్తం 4.8 బిలియన్ డాలర్లు చెల్లించిన అదానీ గ్రూప్.
భారతీయ మార్కెట్లో ఉన్న బొగ్గు ధరతో పోల్చితే రెట్టింపునకుపైగా ధరను చూపించిన అదానీ కంపెనీలు.
అదానీ కంపెనీల్లో పెద్ద ఎత్తున వాటాలున్న ఓ రహస్య భాగస్వామికి చెందిన తైవాన్ సంస్థల ద్వారా చురుగ్గా లావాదేవీలు.
2019-2021 మధ్య 32 నెలలకుపైగా కాలంలో అదానీ కంపెనీ ద్వారా భారత్కు ఇండోనేషియా నుంచి 30సార్లు జరిగిన బొగ్గు దిగుమతులు. ప్రతిసారీ విదేశాల్లో కొన్న రేటు కంటే స్వదేశంలో ఎక్కువ రేటునే పేర్కొన్న అదానీ. ఇలా రూ.600 కోట్లకుపైగా లాభం పొందిన సంస్థ.
అదానీ గ్రూప్లోని ప్రధాన సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్కు వచ్చే ఆదాయంలో బొగ్గు లావాదేవీల ద్వారా సమకూరేదే ఎక్కువ. అదానీ కోల్ ట్రేడింగ్ విభాగం పేరు ఇంటిగ్రేటెడ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. దీని లాజిస్టిక్స్, కమోడిటీ ట్రేడింగ్లో 200 మంది నిపుణులు పనిచేస్తారు. వీరంతా నాలుగు అంతర్జాతీయ కార్యాలయాలు, 19 భారతీయ కేంద్రాల్లో ఉంటారు.
2019 జనవరిలో ఇండోనేషియా నుంచి 74,820 టన్నుల బొగ్గు దేశంలోకి దిగుమతి. ఇండోనేషియా
ఎగుమతి రికార్డుల్లో ఈ బొగ్గు ధర 1.9 మిలియన్ డాలర్లుగా, షిప్పింగ్, ఇన్సూరెన్స్ 42,000 డాలర్లుగా ఉన్నది. కానీ గుజరాత్లోని తమ సొంత ముంద్రా పోర్టులో దిగుమతి రికార్డుల్లో 4.3 మిలియన్ డాలర్లుగా పేర్కొన్న అదానీ.
భారత్కు ఇండోనేషియా నుంచి 30సార్లు 3.1 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతైంది. విలువ 139 మిలియన్ డాలర్లు. షిప్పింగ్, ఇన్సూరెన్స్ 3.1 మిలియన్ డాలర్లు అదనం. భారత్కొచ్చేసరికి 215 మిలియన్ డాలర్లకు చేర్చిన అదానీ.
తైవాన్లోని హీ లింగోస్, దుబాయ్లోని తౌరుస్ కమోడిటీస్ జనరల్ ట్రేడింగ్, సింగపూర్లోని ప్యాన్ ఆసియా ట్రేడ్లింక్ మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా అదానీ గ్రూప్నకు ప్రధానంగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతులు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర్నుంచే నరేంద్ర మోదీతో గౌతమ్ అదానీ స్నేహం కొనసాగుతున్నది. మోదీ దేశ ప్రధాని కావడంతో ఈ బంధం మరింత బలపడిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అదానీ గ్రూప్ ఆయా రంగాల్లోకి ఎలా విస్తరించింది.. వివిధ కంపెనీలను ఎలా హస్తగతం చేసుకున్నది.. దేశంలో, ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ ఎలా ఎదిగారన్నది తెలిసిందే. ఇక అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అక్రమాలపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్టు ఎంత అలజడి రేపిందో కూడా విదితమే. అదానీ కోసం ప్రధాని హోదాలో మోదీ చేసిన విదేశీ టూర్లు, అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాలపైనా రచ్చ కొనసాగుతూనే ఉన్నది. బీఆర్ఎస్సహా విపక్షాలు.. పార్లమెంట్లో ఆందోళన చేసిందీ చూశాం.