Adani Group | గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల షేర్లు మరోమారు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. భారత్లో ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం అనుకూలంగా వ్యవహరించాలంటూ అదానీ గ్రూప్, దాని చైర్మన్ గౌతం అదానీతోపాటు కొందరు లంచం ఇవ్వజూపారా? అన్న విషయమై అమెరికాలో దర్యాప్తు జరుగుతున్నదని బ్లూంబర్గ్ వార్తాకథనం తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇంట్రాడే ట్రేడింగ్లో అదానీ గ్రూప్ సంస్థల అన్ని షేర్లు భారీగా నష్టపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు కోలుకుని స్వల్ప నష్టాలతో కొనసాగాయి.
అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ ఉదయం ఐదు శాతం నష్టపోయి, చివరకు ముగింపు సమయానికి 0.65 శాతం నష్ట పోయింది. అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ, అదానీ పవర్ తదితర సంస్థలు రెండు నుంచి 4.5 శాతం మధ్య నష్టపోయాయి. సోమవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ రూ.48,298 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. అమెరికాలోని అదానీ గ్రూప్ డాలర్ బాండ్ల విలువ కూడా తగ్గింది.
అమెరికా అటార్నీ జనరల్ ఆఫీస్, జస్టిస్ డిపార్ట్ మెంట్ అనుబంధ ఫ్రాడ్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతున్నదని వ్యాఖ్యానించింది. అజ్యూర్ పవర్ గ్లోబల్ అనే ఎనర్జీ కంపెనీపైనా దర్యాప్తు ప్రారంభమైందని బ్లూంబర్గ్ తెలిపింది. అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ ట్రేడ్ కావడం లేదు. కానీ అదానీ గ్రూప్ సంస్థల్లో అమెరికన్ల పెట్టుబడులు ఉన్నందున యూఎస్ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టవచ్చు. ఇదిలా ఉంటే, అమెరికాలో దర్యాప్తు విషయమై తమకు అధికారిక సమాచారం లేదని అదానీ గ్రూప్ పేర్కొంది. గతేడాది షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ చేసిన విమర్శలతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా నష్టపోయింది.