ప్రధాని మోదీతో గౌతమ్ అదానీకి ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రఖ్యాత ‘బ్లూమ్బర్గ్’ బిజినెస్ వీక్ మ్యాగజైన్ కవర్ స్టోరీగా ప్రచురించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మోదీ హయాం అదానీకి స్వర్ణయుగంలా మారిందంటూ విపక్షాలతోపాటు నివేదికలూ తూర్పారబడుతున్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ.. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదానీ గ్రూప్ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోయింది.
గడిచిన 9 ఏండ్లలో 70కిపైగా భారీ ఒప్పందాలు, కొనుగోళ్లను అదానీ పూర్తిచేశారు. తద్వారా సంపదను 70 రెట్లు వృద్ధి చేసుకొన్నారు. బొగ్గు, విద్యుత్తు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, సిమెంట్, మీడియా, గ్యాస్ ఇలా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతీ రంగంలో అదానీ గ్రూప్ వేళ్లూనుకొన్నదిప్పుడు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): దోస్తుకు ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి సాక్షాత్తూ ప్రధాన మంత్రి 40 దేశాల్లో పర్యటించినట్టు వాదనలు వినిపిస్తున్నాయి. మిత్రుడికి దోచిపెట్టేందుకు దౌత్య సంబంధాలను సైతం తాకట్టు పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అదానీ గ్రూప్నకు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. నిబంధనల్ని కూడా మార్చిందన్నది ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నది.
‘ప్రధాని మోదీ ఆసక్తి కనబర్చే రంగంలోకి అదానీ ముందే ప్రవేశిస్తారు’ అంటూ బ్లూమ్బర్గ్ మ్యాగజైన్లో పేర్కొన్నది. దీన్ని నిజం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టాలనుకొన్న కీలక రంగాల్లోనే అదానీ గ్రూప్ ముందుగానే భారీగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం. 2014-2023 మధ్య అదానీ గ్రూప్ పూర్తి చేసిన 70 వరకూ భారీ ఒప్పందాలు, కొనుగోళ్లను విశ్లేషిస్తే ఈ విషయం అర్థమవుతున్నది. దేశంలోని రవాణాకు కీలకంగా మారిన మొత్తం పోర్టుల్లో అదానీ గ్రూప్ వాటా 24 శాతంగా ఉన్నది. తీర ప్రాంతం ఉన్న 8 రాష్ర్టాల్లో 13 పోర్టులు అదానీవే. శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్లో కూడా ఈ గ్రూప్నకు పోర్టులున్నాయి. దేశంలోని ప్రఖ్యాత నగరాల్లోని 7 విమానాశ్రయాలను 50 ఏండ్లపాటు నిర్వహించే లీజు అదానీ గ్రూప్నకే దక్కింది. అంబుజా, ఏసీసీ సిమెంట్స్ను కొనుగోలు చేసి సిమెంటు రంగంలో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఎన్డీటీవీ, క్వింటిలియన్లో వాటాలను కొని మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్.. బొగ్గు, పునరుత్పాదక, గ్యాస్, విద్యుత్తు, రిటైల్, వంటనూనెలు ఇలా కీలక రంగాలన్నింటిలో పాతుకుపోయింది.
ఆప్తమిత్రుడికి ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు దౌత్య సంబంధాలను తాకట్టు పెట్టడానికీ వెనుకాడని ప్రధాని.. పలు దేశాల్లో రాజకీయ ప్రకంపనలు రేగడానికి కారణమయ్యారన్న విమర్శలు వినిపి స్తున్నాయి. శ్రీలంకలోని మ న్నార్లో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంటు కాంట్రాక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్నకు అప్పగించాలని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సపై మోదీ ఒత్తిడి తీసుకొచ్చినట్టు గత జూన్లో వెల్లడైంది. శ్రీలంకకు చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) అప్పటి చైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండోయే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడం సంచలనం సృష్టించింది. దీంతో అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా లంకలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఇక అదానీ పవర్తో కుదుర్చుకొన్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ఆర్థికంగా తమకు నష్టదాయకంగా ఉన్నదని, ఆ డీల్లో సవరణలు చేయాలని పట్టుబడుతూ బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు (బీపీడీబీ) ఇటీవల చేసిన సూచనలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి. ఈ ఒప్పందం కుదర్చడంలో స్వయంగా మోదీ భాగమవ్వడమే దీనికి ప్రధాన కారణం. అంతేనా విమానయానంలో ఎలాంటి అనుభవం లేని అదానీ గ్రూప్నకు 7 ఎయిర్పోర్టులను 50 ఏండ్లపాటు లీజుకు ఇవ్వడంతోపాటు యథేచ్ఛగా బొగ్గు గనులను కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చేసిందంటు న్నారు. పర్యావరణ నియమాలను అతిక్రమించి గుజరాత్లోని ముంద్రా పోర్టులో నిర్మాణాలు చేపట్టినందుకు 2013లో అప్పటి యూపీఏ సర్కారు అదానీ గ్రూప్నకు రూ.200 కోట్ల జరిమానా విధిస్తే, 2017లో మోదీ సర్కారు జరిమానాను రద్దు చేయడం విమర్శలకు తావిచ్చింది.
అదానీ గ్రూప్నకు లబ్ధి చేకూర్చడానికి 40 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించినట్టు గణాంకాలను విశ్లేషిస్తే అర్థమవుతున్నది. 2014 మేలో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరక్కుండానే నవంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన.. అక్కడి ప్రభుత్వంతో దౌత్య సంబంధాల్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకొన్నట్టు చెప్తున్నారు. ఒప్పందంలో భాగంగా దేశంలో భారీ రైల్వే, మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టులు అనూహ్యంగా అదానీ గ్రూప్నకే దక్కాయి. 2015 ఏప్రిల్లో ప్రధాని ఫ్రాన్స్ పర్యటన జరగ్గా.. అదానీ గ్రూప్తో రాఫెల్ కంపెనీ ఓ ఒప్పందం కుదుర్చుకొన్నది. అదే ఏడాది జూన్లో బంగ్లాలో పర్యటించిన మోదీ అదానీ గ్రూప్నకు విద్యుత్తు కాంట్రాక్టు వచ్చేలా చేశారన్న విమర్శలున్నాయి. ఇదే ఏడాది నవంబర్లో మలేషియాలో మోదీ పర్యటించిన అనంతరం 2017లో అదానీ గ్రూప్నకు ఆ ప్రభుత్వం ఐలాండ్ పోర్టు కట్టబెట్టింది. 2016 ఫిబ్రవరిలో స్వీడన్, మార్చిలో ఇజ్రాయెల్, జూన్లో అమెరికా, జూలైలో మొజాంబిక్, నవంబర్లో జపాన్లో మోదీ పర్యటించగా.. అదానీ గ్రూప్తో ఆయా ప్రభుత్వాలు పలు ఒప్పందాలు చేసుకొన్నాయి. 2017 నుంచి 2023 వరకు మరో 30కి పైగా దేశాల్లో అదానీ గ్రూప్నకు ప్రాజెక్టులు దక్కినట్టు, ఆయా దేశాల్లో అంతకుముందే ప్రధాని పర్యటించినట్టు వార్తలను బట్టి తెలుస్తున్నది.
9 ఏండ్లలో అదానీ గ్రూప్ పూర్తిచేసిన డీల్స్/కొనుగోళ్లు 70
మిత్రుడి కోసం ప్రధాని మోదీ పర్యటించిన దేశాలు 40
2014లో అదానీ సంపద రూ.17,000 కోట్లు
2022 డిసెంబర్ నాటికి సంపద రూ.11.3 లక్షల కోట్లు