న్యూఢిల్లీ, జూలై 14: ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 60 శాతం తగ్గి రూ.227.35 కోట్లకు పరిమితమైనట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికిగాను సంస్థ రూ.569.45 కోట్ల లాభాన్ని గడించింది.
సంస్థ జనవరి-డిసెంబర్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా వ్యవహరిస్తున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.3,884.94 కోట్ల నుంచి రూ.4,468.42 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.3,175.47 కోట్ల నుంచి రూ.4,221.74 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది.