న్యూఢిల్లీ, జనవరి 27: వినూత్న వాహనాలను ప్రవేశపెట్టడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో..టూ-ఇన్=వన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనం, త్రీ వీలర్ విద్యుత్ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది హీరోకు చెందిన సర్జ్ స్టార్టప్. ఇటీవల జరిగిన హీరో వరల్డ్ కార్యాక్రమంలో ఈ వాహనాన్ని ప్రదర్శించింది కూడా. సర్జ్ ఎస్32 పేరుతో పిలువబడే ఈ వాహనం అవసరాలకు తగ్గట్టుగా కావాల్సిన విధంగా కేవలం మూడు నిమిషాల్లోనే మార్చుకోవచ్చునని తెలిపింది.
వ్యాపార అవసరాలకోసం మూడు చక్రాలుగాను, వ్యక్తిగత అవసరాలకోసం ద్వి చక్ర వాహనంగా మార్చుకునే వీలుంటుంది. ఈ వాహనం రెండు వేరువేరు సామర్థ్యాలతో రూపొందించింది. 11 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మూడు చక్రాల వాహనం టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు కాగా 500 కిలోల సరుకు బరువును మోసుకెళ్లగలదు. 3 కిలోవాట్ల బ్యాటరీతో తయారు చేసిన ద్విచక్ర వాహనం గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నది.