IndiGo | న్యూఢిల్లీ, జనవరి 4: దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఇండిగో.. టికెట్లపై ఇంధన చార్జీని ఎత్తివేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు టికెట్ ధరలు రూ.1,000 వరకు తగ్గాయి. విమాన ఇంధన (జెట్ ఫ్యూయల్ లేదా ఏటీఎఫ్) ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 6 నుంచి దేశ, విదేశీ ప్రయాణాల టికెట్లపై ఇంధన చార్జీలను ఇండిగో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి భారతీయ విమానయాన సంస్థ కూడా ఇండిగోనే. దూరాన్నిబట్టి ప్రయాణికుల దగ్గర రూ.300ల నుంచి రూ.1,000 వరకు ఈ ఫ్యూయల్ చార్జీని వసూలు చేశారు. ప్రయాణ దూరం 500 కిలోమీటర్లదాకా ఉంటే టికెట్పై ఇంధన చార్జీగా రూ.300 తీసుకున్న ఇండిగో.. ఆపై దూరాలకు రూ.400 నుంచి రూ.1,000 వరకు తీసుకున్నది. 3,500 కిలోమీటర్లు, ఆపై దూరానికి టికెట్పై అదనంగా రూ.1,000 వేసింది. అయితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడంతో ఈ ఇంధన చార్జీలను తొలగిస్తున్నట్టు ఇండిగో స్పష్టం చేసింది. తమ ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా సంస్థ పేర్కొన్నది.
కాగా, ఏటీఎఫ్ ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నాయని, దాంతో మార్పులకు అనుగుణంగా మా టికెట్ ధరలను సవరిస్తూ ఉంటామని కూడా ఇండిగో ఈ సందర్భంగా ఓ ప్రకటనలో చెప్పింది. ప్రతీ విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చులే కీలకం. అయితే దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ మళ్లీ పెరుగుతున్న వేళ టికెట్ ధరల పెంపుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గత నెల కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. టికెట్ చార్జీలను పెంచే ముందు ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని విమానయాన సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ ధరలు తగ్గడం వల్లే ఫ్యూయల్ చార్జీని ఎత్తివేస్తున్నామని ఇప్పుడు ఇండిగో చెప్తున్నా.. తాజా నిర్ణయం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకున్నది.