హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థాపక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటిని విస్తరించేందుకు కాకతీయ సాండ్బాక్స్కు భారత సంతతి అమెరికా వ్యాపారవేత్త కన్వల్ సింగ్ రేఖీ బుధవారం రూ.20 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇక్కడ టై గ్లోబల్ సమ్మిట్-2022లో పాల్గొన్న ఈ సిలికాన్ వ్యాలీ వ్యాపారి.. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నడుస్తున్న కాకతీయ సాండ్బాక్స్కు అండగా నిలిచారు. హెచ్ఐసీసీలో కాకతీయ సాండ్బాక్స్ సహ వ్యవస్థాపకుడు రాజురెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఉత్తర తెలంగాణ కేంద్రంగా కాకతీయ సాండ్బాక్స్ గత తొమ్మిదేండ్లుగా చేస్తున్న కార్యకలాపాలను కొనియాడారు. ఈ క్రమంలోనే క్రెస్ట్ (కన్వల్ రేఖీ రూరల్ ఎంటర్ప్రెన్యూర్షిప్-కెఆర్ఈఎస్టీ) పేరుతో నిజామాబాద్లో ప్రత్యేక కేంద్రా న్ని ఏర్పాటు చేసి, ఉత్తర తెలంగాణ అంతటా కార్యకలాపాలను నిర్వహిస్తామన్నారు. కాకతీయ సాండ్బాక్స్ ఏర్పాటు చేసిన కె-హబ్కు అనుబంధంగా క్రెస్ట్ పనిచేస్తుందని తెలిపారు. రాజురెడ్డి మాట్లాడుతూ.. కన్వల్ రేఖీ సహకారంతో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో క్రెస్ట్ ఒక నమూనాగా మారగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ విరాళం.. గ్రామాల్లోని ప్రతిభావంతులైన యువకులకు భారీ ప్రయోజనాన్ని చేకూర్చగలదన్నారు. వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్లలో కార్యక్రమాల విస్తరణకు కాకతీయ సాండ్బాక్స్ దోహదపడుతుందన్నారు.