హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): లాజిస్టిక్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ హైదరాబాద్ దూసుకుపోతున్నది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఇటీవలి ‘ఇండియా వేర్ హౌజింగ్ మార్కెట్’ నివేదిక ప్రకారం ఈ ఏడాది దేశంలోనే 128 శాతం వృద్ధిరేటుతో 8 మెట్రో నగరాల్లో 2వ స్థానంలో భాగ్యనగరం నిలిచింది. 166 శాతం వృద్ధిరేటుతో మొదటి స్థానంలో పుణె ఉన్నది. మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా మార్గాలతో హైదరాబాద్ అత్యంత అనుకూలమైన ప్రాంతంగా అవతరిస్తున్నది. ఇందుకు తగ్గట్టే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కూడా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం వద్ద,హైదరాబాద్-నాగార్జునసాగర్ జాతీ య రహదారిపై మంగల్పల్లి వద్ద రెండు లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు. వీటిలో ఆయా కంపెనీలు సుమారు రూ.47 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సమీపంలో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్నూ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపడుతున్నది.
శంషాబాద్ విమానాశ్రయం దన్నుతో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సరకుల నిల్వ, రవాణా కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. ఇప్పటికే విమానాశ్రయంలోనే ఆన్లైన్ సంస్థల కోసం భారీ విస్తీర్ణంలో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా శంషాబాద్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ సమీపంలో గోడౌన్ల నిర్మాణాలు పెరిగాయి. బెంగళూరు జాతీయ రహదారి కావడం, నగరానికి సమీపంలోనే ఉండటంతో ఈ ప్రాంతం అందరికీ అనుకూలంగా మారింది.
మేడ్చల్, శంషాబాద్ల్లోనే అత్యధికంగా గోదాములుంటున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం లోపల అమెజాన్ కంపెనీ పెద్ద గోదాంను ఏర్పాటు చేసింది కూడా. ఇక చుట్టుపక్కల ఇతర ఆన్లైన్ కంపెనీలకు చెందిన గోదాములున్నాయి. కాగా, సరకు రవాణాకు సంబంధించిన కీలకమైన గోదాములు నగరానికి ఉత్తరం వైపున ఉన్న మేడ్చల్లో 50 శాతం ఉండగా, దక్షిణం వైపున్న శంషాబాద్లో 41 శాతం, పటాన్చెరువులో 8 శాతం వరకున్నాయి. అయితే మున్ముందు శంషాబాద్లోనే మరింత ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఉంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.