Indian Rupee | ముంబై, ఆగస్టు 2: కొద్ది నెలలపాటు స్థిరంగా నిల్చిన రూపాయి విలువ హఠాత్తుగా పతనమయ్యింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో అమెరికా డాలరు మారకంలో భారత్ కరెన్సీ విలువ ఒక్కసారిగా 45 పైసలు పడిపోయి, 82.67 వద్ద నిలిచింది. ఒకే రోజుల్లో ఇంతగా పతనంకావడం గత ఆరునెలల్లో ఇదే ప్రధమం. ఈ ఏడాది ఫిబ్రవరి 6న రూపాయి 68 పైసలు కోల్పోయింది. తాజాగా రిస్క్తో కూడిన ఈక్విటీలు, వర్థమాన దేశాల బాండ్ల కొనుగోలుకు ఇన్వెసర్లు విముఖత ప్రదర్శించడంతో ఆసియా కరెన్సీలన్నీ బలహీనపడ్డాయని, దీనికి తోడు అమెరికా డాలర్ బలపడిందని, ఈ నేపథ్యంలో రూపాయి క్షీణించిందంటూ ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
వాస్తవానికి యూఎస్ క్రెడిట్ రేటింగ్ను డౌన్గ్రేడ్ చేయడంతో తొలుత డాలరు బలహీనపడినప్పటికీ, అంతర్జాతీయ అనిశ్చితిలో సురక్షితంగా పరిగణించే డాలర్లకు డిమాండ్ పెరిగిందని బీఎన్పీ పారిబా రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. రానున్న కొద్దిరోజుల్లో రూపాయి 82.20-83 శ్రేణిలో ట్రేడ్ కావచ్చని అంచనా వేశారు. అధిక క్రూడ్ ధరలు, దేశం నుంచి డాలర్లు తరలివెళ్లడం, మార్కెట్ సెంటిమెంట్ ప్రతికూలంగా మారడం వంటి అంశాలు రూపాయిని బలహీనపర్చాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ వివరించారు. 2022 ఫిబ్రవరి నుంచి రూపాయి 81.50-83 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నదని, మరికొద్ది రోజులు ఇదే శ్రేణిలో కదలవచ్చని అంచనా వేశారు.