హైదరాబాద్, నవంబర్ 4: షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. డయాబెటిస్ వైద్యంలో అంతర్జాతీయ విప్లవానికి తెరితీస్తూ ఇంజెక్షన్తో పనిలేని ఓ సంచలనాత్మక చికిత్సా విధానాన్ని హైదరాబాద్కు చెందిన నీడిల్ఫ్రీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కనుగొన్నది. సూది మందుకు బదులు ముక్కు ద్వారాగానీ, నోటి ద్వారాగానీ ఇన్సులిన్ను తీసుకునేలా ఓ సరికొత్త స్ప్రేను అభివృద్ధి చేసింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్లు డాక్టర్ కే కోటేశ్వరరావు, సీఏ విశ్వనాథ్ తోష్నివాల్, డాక్టర్ జితేంద్ర అంబుల్గే తెలియజేశారు.
‘ఓజులిన్’ పేరుతో ఓరల్ ఇన్సులిన్ను మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నట్టు ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది పరిచయం కానుందన్నారు. దీంతో కోట్లాది మంది చక్కెర వ్యాధిగ్రస్తులకు గొప్ప ఉపశమనం లభిస్తుందని, ముఖ్యంగా సూదుల ద్వారా శరీరంలోకి ఇన్సులిన్ను తీసుకునే బాధ తప్పుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్లు వ్యక్తం చేశారు.
ఇక శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఓజులిన్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తమ పరిశోధనల్లో గుర్తించామని పేర్కొన్నారు. ఇదిలావుంటే అల్జీమర్స్, పార్కిన్సన్స్, క్యాన్సర్ చికిత్సల్లోనూ సూది మందులకు ప్రత్యామ్నాయంగా ఔషధాలను తెచ్చేలా నీడిల్ఫ్రీ టెక్నాలజీస్ అడుగులు వేస్తుండటం గమనార్హం. కాగా, మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ట్రాన్స్జెన్ బయోటెక్ లిమిటెడ్ అనుబంధ సంస్థే ఈ నీడిల్ఫ్రీ టెక్నాలజీస్. రెండేండ్ల క్రితం ఇది ఏర్పాటైంది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే ఓరల్ ఇన్సులిన్ పరిశోధనలు మొదలయ్యాయని, అయితే ఎట్టకేలకు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో సత్ఫలితాలు వచ్చాయని కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్ కోటేశ్వరరావు వివరించారు.