న్యూఢిల్లీ, ఆగస్టు 2: ముగిసిన జూలై నెలలో భారత్ వాణిజ్యలోటు భారీగా పెరిగింది. ఎగుమతుల్లో వృద్ధి లేకపోవడం, దిగుమతులు జోరు కొనసాగడంతో 2022 జూలైలో వాణిజ్య లోటు రికార్డుస్థాయిలో 31.02 బిలియన్ డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఇంత లోటు నమోదుకావడం ఇదే ప్రథమం. 2021 జూలై వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరగడం గమనార్హం. 2022 జూన్ లోటు 26.18 డాలర్లకంటే కూడా జూలైలో 20 శాతం పెరిగింది. ముగిసిన నెలలో ఎగుమతులు 0.76 శాతం మాత్రమే అధికమై 35.24 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 46.15 బిలియన్ డాలర్ల నుంచి 66.26 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
కమోడిటీ ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటంతో దిగుమతుల విలువ పెరిగిందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం మంగళవారం మీడియాకు తెలిపారు. అయితే బంగారం దిగుమతులు మాత్రం 4.2 బిలియన్ డాలర్ల నుంచి 2.37 బిలియన్ డాలర్లకు తగ్గాయి. పుత్తడి దిగుమతులపై సుంకాలు పెంచడం ఇందుకు కారణమని వాణిజ్య కార్యదర్శి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 470 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలన్నది లక్ష్యంకాగా, ఇందుకు అనుగుణంగా తొలి నాలుగు నెలల్లో 156.41 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని ఆయన వివరించారు.