Jobs | న్యూఢిల్లీ, ఆగస్టు 1: లక్షలాది మంది నిరుద్యోగులకు ఆపన్నహస్తం అందిస్తున్న ఈ-కామర్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలకు కొదవలేకుండా ఉన్నది. ప్రస్తుతేడాది రెండో అర్థభాగంలో 7 లక్షల మందికి తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని టీమ్ లీజ్ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడంతోపాటు పండుగ సీజన్ కూడా తోడవడంతో తాత్కాలిక ఉద్యోగులకు ఎనలేని డిమాండ్ నెలకొన్నదని తన నివేదికలో వెల్లడించింది. ఈ పండుగ సీజన్లో ఉద్యోగ అవకాశాలు 25 శాతం వరకు పెరగవచ్చునని తన అవుట్లుక్లో పేర్కొంది.
ఆన్లైన్లో అన్నీ…
ఒక్క క్లిక్తో నచ్చిన వస్తువును కొనుగోలు చేసుకునే సేవలు అందుబాటులోకి రావడంతో కస్టమర్లు ఆన్లైన్కు పెద్దపీట వేస్తున్నారు. రిటైల్ అవుట్లెట్లకు వెళ్లి కొనుగోలు చేయడంతోపాటు బిల్లు కోసం క్యూ లైన్లో నిలబడే ఒపిక లేకపోవడంతో ఆన్లైన్ వైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఆన్లైన్ సంస్థలు ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే వస్తువుల ధరలు తక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణమని విశ్లేషించింది. ఈ పండుగ సీజన్లో మెట్రో నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాలైన వడొదర, పుణె, కోయంబత్తూరులలో డిమాండ్ అధికంగా ఉంటుందని పేర్కొంది.
తాత్కాలిక ఉద్యోగాలకు డిమాండ్ ఉన్న నగరాలు..
గిడ్డంగులకు డిమాండ్
వస్తువును బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు తమ వస్తువును వేగవంతంగా అందించడానికి ఈ-కామర్స్ సంస్థలు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయి. గిడ్డంగుల ఏర్పాటుతోపాటు కాల్ సెంటర్ల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ గిడ్డంగులు మెట్రో నగరాలతోపాటు ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో సైతం నెలకొల్పుతున్నాయని నివేదిక వెల్లడించింది. 2029-30 నాటికి గిగావర్కర్ల సంఖ్య 2.35 కోట్లకు చేరుకుంటుందని అంచనావేస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ఇందుకు కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నాయి.
‘గత ఐదేండ్లలో గిగా వర్కర్లకు డిమాండ్ నెలకొన్నది. ప్రతియేటా 20 శాతం చొప్పున పెరిగారు. వచ్చే రెండు నుంచి మూడేండ్ల వరకు ఈ డిమాండ్ కొనసాగనున్నది. ఈ పండుగ సీజన్లో ఒకే ఒక సంస్థ 2 లక్షల మందిని తీసుకోనున్నది’
– బాలసుబ్రమణియన్, టీమ్లీజ్ సర్వీసుల వైస్ ప్రెసిడెంట్